- వారికి వైద్య పరీక్షల్లో నెగెటివ్ రిపోర్టులు వచ్చాయన్న గాంధీ డాక్టర్లు
- మరో ఇద్దరి రిపోర్టులు రావాల్సి ఉందని వెల్లడి
- అందరికీ మరోసారి టెస్టులు చేస్తామని ప్రకటన
కరోనా వైరస్ సోకిన బాధితుడితో కలిసి ప్రయాణించినవారు, కుటుంబ సభ్యులు, స్నేహితుల్లో టెస్టులు చేసిన 45 మందికి కరోనా వైరస్ సోకలేదని హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. మరో ఇద్దరి శాంపిల్స్ కు సంబంధించి పుణె లోని వైరాలజీ ల్యాబ్ రిపోర్టు రావాల్సి ఉందని.. వారిలో ఒకరు ఇటలీ వెళ్లి వచ్చినవారు కాగా, మరొకరు కరోనా సోకిన వ్యక్తితో నేరుగా ఎక్కువ సమయం కాంటాక్ట్ లో ఉన్నాడని వివరించారు.
వారందరూ ఇంట్లోనే ఉండాలి
వైద్య పరీక్షల్లో నెగిటివ్ రిపోర్టు వచ్చినా కూడా ఈ 45 మంది సుమారు రెండు వారాల పాటు హౌస్ ఐసోలేషన్ (బయటికి ఎక్కడికీ రాకుండా పూర్తిగా ఇంట్లోనే..) లో ఉండాలని అధికారులు ఆదేశించారు. కొన్ని రోజుల తర్వాత వారికి మరోసారి వైద్య పరీక్షలు చేస్తామని తెలిపారు.