ఫేస్బుక్ ప్రేమ.. మూడునెలల కాపురం.. ఆ తర్వాత ప్రియుడి పరారీ!
- నాలుగు నెలల క్రితం ఫేస్బుక్లో యువతితో పరిచయం
- పెళ్లి విషయం పెద్దలకు చెప్పి ఒప్పించి వస్తానని వెళ్లి మాయం
- ఫోన్ చేస్తే ఇద్దరికీ ఎటువంటి సంబంధమూ లేదని సమాధానం
పోలీసుల కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లాలోని రావులపల్లికి చెందిన గజ్జెల రాజేందర్గౌడ్ అలియాస్ రాజేందర్ (28) ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నాడు. ఫేస్బుక్లో నాలుగు నెలల క్రితం నేరేడ్మెట్కు చెందిన యువతి (20) పరిచయం అయింది. కొన్ని రోజుల తర్వాత ఆ పరిచయం ప్రేమగా మారింది. విడిచి ఉండలేనని, పెళ్లి చేసుకుందామని నమ్మించాడు. ఆమె తన వలలో పడిందని నిర్ణయించుకున్న రాజేందర్ మూడు నెలల క్రితం తల్లిదండ్రులకు తెలియకుండా స్నేహితుల సమక్షంలో దండలు మార్చుకుని పెళ్లి అయిందని ఆమెను నమ్మించాడు.
ఆ తర్వాత నేరెడ్మెట్లోనే మూడు నెలలు కాపురం చేశారు. తమ పెళ్లి విషయం పెద్దలకు చెప్పి ఒప్పిస్తానని ఇటీవల వెళ్లిన రాజేందర్ జాడలేకుండా పోయాడు. అతడు ఎంతకీ తిరిగి రాకపోవడంతో బాధిత యువతి అతడికి ఫోన్ చేసింది. అప్పుడు రాజేందర్ చెప్పింది విని ఆమె షాకైంది. పెళ్లికి పెద్దలు ఒప్పుకోవడం లేదని, ఇద్దరికీ ఏ సంబంధమూ లేదని తేల్చి చెప్పాడు. దీంతో మోసపోయానని గ్రహించిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిన్న నిందితుడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండుకు తరలించారు.