ఆ ‘151’ పోవడానికి ఎంతో టైమ్ పట్టదు: వైసీపీ సర్కార్ పై సీపీఎం నేత మధు ఫైర్

  • మూడు రాజధానుల నిర్ణయం రాష్ట్రానికి బాగా నష్టం చేస్తుంది
  • వైసీపీ తన గొయ్యి తానే తవ్వుకున్నట్టు అవుతోంది
  • కన్నూమిన్నూ కానరన్న సామెత జగన్ ని చూస్తే నిజమే అనిపిస్తోంది
ఏపీలో ‘మూడు రాజధానుల’ ఆలోచన చేస్తున్న వైసీపీ ప్రభుత్వంపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు మండిపడ్డారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో ఇరవై నాలుగు గంటల దీక్షను ఈ రోజు ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మూడు రాజధానుల నిర్ణయం రాష్ట్రానికి బాగా నష్టం చేస్తుందని, రాజధాని తరలింపు నిర్ణయంతో వైసీపీ తన గొయ్యి తానే తవ్వుకున్నట్టు అవుతోందని విమర్శించారు. అధికారంలోకి వస్తే కన్నూమిన్నూ కానరన్న సామెత సీఎం జగన్ ని చూస్తుంటే నిజమే అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. రాజధాని తరలింపు విషయమై జగన్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే భారీ మూల్యం తప్పదని హెచ్చరించారు.

దేశంలోనే కాదు మన రాష్ట్రంలోనూ ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించేది ఏదైనా ఉందంటే అది ‘రియల్ ఎస్టేట్’ వ్యాపారమేనని అన్నారు. ఐదేళ్లుగా మన రాష్ట్రంలో పెరిగిన రియల్ ఎస్టేట్ వ్యాపారం ఒక్కసారిగా కుప్పకూలిపోయిందని, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని ఇళ్లల్లో అద్దెలకు వచ్చే వాళ్లు కూడా కరవయ్యారని అన్నారు. 151 సీట్లతో అద్భుతమైన విజయం సాధించామని చెప్పుకుంటున్న వైసీపీకి ఆ నూట యాభై ఒక్కటీ పోవడానికి ఎంతో టైమ్ పట్టదంటూ ప్రజలు తిరస్కరిస్తారని పరోక్షంగా వ్యక్తం చేశారు.

CPM Madhu
YSRCP
Andhra Pradesh
Government
Amaravati
captial

More Telugu News