ప్రతిపక్షాలు లేకుండా చేసి కేసీఆర్ నియంతను తలపిస్తున్నారు: విజయశాంతి

  • కాంగ్రెస్, టీడీపీల ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి మంత్రి పదవులిచ్చారు
  • జడ్పీ ఎన్నికల ఫలితాల సమయంలో అదే చేశారు
  • తాజాగా మున్సిపల్ ఎన్నికల ఫలితాల సమయంలో కూడా..
రాజకీయాల్లో ప్రతిపక్షం అన్నది లేకుండా చేసి సీఎం కేసీఆర్ నియంతను తలపిస్తున్నారని కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్ పర్సన్ విజయశాంతి విమర్శించారు. ఈ తరహా పోకడలతో ఆయన నియంతలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచారన్నారు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఆమె ఫేస్ బుక్ మాధ్యమంగా స్పందించారు.

ఈ ఎన్నికల్లో గెలిచిన ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులను ప్రలోభపెట్టే పనిలో టీఆర్ఎస్ అధిష్ఠానం తలమునకలైందన్నట్లు వార్తలు వస్తున్నాయని, ప్రజా ప్రతినిధులను లోబర్చుకోవడం కేసీఆర్ అండ్ కోకు కొత్త కాదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, టీడీపీలకు చెందిన ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి వారికి మంత్రి పదవులు ఇచ్చి..రాజ్యాంగ విలువలు మంట గలిపారన్నారు.

ఈ తీరు ఇక్కడే ఆగిపోలేదని జడ్పీ ఎన్నికల ఫలితాలప్పుడు కూడా కనిపించిందని ఆమె చెప్పారు. తాజాగా అదే తీరును మున్సిపల్ ఎన్నికల ఫలితాల సందర్భంగా కొనసాగిస్తోందని ఆరోపించారు. గెలిచిన ప్రతిపక్షాల అభ్యర్థులను లొంగదీసుకోవాలని ప్రయత్నిస్తోందన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ఓ దుస్పంప్రదాయానికి తెరతీసిందని ఆరోపించారు. ఓటర్లను తమవైపు మొగ్గే విధంగా కలుషితం చేశారన్నారు.

తాము గెలిపించిన ప్రతిపక్ష అభ్యర్థులు ప్రలోభాలకు లొంగి చివరికి టీఆర్ఎస్ లో చేరుతారని ఓటర్లు భావిస్తున్నారని.. ఇతర పార్టీలకు ఓటు వేయడం కంటే.. టీఆర్ఎస్ కే ఓటు వేయాలన్న ఆలోచన వారిలో కలుగుతోందన్నారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కేసీఆర్ ఇచ్చిన హామీలను ప్రతిపక్షాలు అడుగుతాయన్న భయంతో ఆయా పార్టీల తరపున గెలిచిన అభ్యర్థులను ప్రలోభపెట్టి తమ పార్టీలోకి లాగుతున్నారని ఆరోపించారు.
Go Back to Shorts
Vijayashanti
Congress
Telangana
Criticism
TRS
CM KCR

More Telugu News