Priyaanka Reddy: ఆ ఇద్దరు అధికారులూ తమ విధులను సక్రమంగా నిర్వర్తించివుంటే... వెటర్నరీ వైద్యురాలు బతికుండేది!

  • దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన శంషాబాద్ కేసు
  • ఓవర్ లోడ్ తో వస్తున్న లారీని వదిలేసిన ఆర్టీఓ
  • అక్రమంగా పార్కింగ్ చేశారని తెలిసీ పట్టించుకోని పోలీసులు

వెటర్నరీ డాక్టర్ హత్య కేసు దేశవ్యాప్తంగా కలకలం సృష్టించగా, బాధ్యతగా ఉండాల్సిన ఇద్దరు ప్రభుత్వ అధికారుల్లో ఏ ఒక్కరు తమ విధిని సక్రమంగా నిర్వర్తించినా ఆ అమ్మాయి ప్రాణాలతో ఉండేదని తెలుస్తోంది. హత్యాచారం జరగడానికి ఒకరోజు ముందు, కేసులో ఏ-1 నిందితుడు ఆరిఫ్, ఐరన్ ను లారీలో లోడ్ చేసుకుని తీసుకు వస్తూ, మహబూబ్ నగర్ ఆర్టీఓ అధికారులకు పట్టుబడ్డాడు. అతని వద్ద డ్రైవింగ్ లైసెన్స్ లేదని, లారీ ఓవర్ లోడ్ తో ఉందని గమనించి కూడా సదరు అధికారి, కేసు నమోదు చేయకుండా, లారీని సీజ్ చేయకుండా వదిలేశాడు. ఇది ఓ నిర్లక్ష్యం.

ఆపై లారీని హైదరాబాద్ శివార్ల వరకూ తీసుకు వచ్చిన ఆరిఫ్, దాన్ని తొండుపల్లి దగ్గర అక్రమంగా పార్కింగ్ చేశాడు. ఆ సమయంలో అటుగా వచ్చిన పోలీసు పెట్రోలింగ్ వాహనం, లారీ ఎందుకుందన్న విషయాన్ని పట్టించుకోకుండా, వెళ్లిపోవాలంటూ హెచ్చరించి వదిలేశారే తప్ప, చర్యలు తీసుకోలేదు. ఈ రెండు ఘటనల్లో ఏ ఒక్కరైనా తమ పనిని సక్రమంగా నిర్వర్తించివుంటే, వెటర్నరీ వైద్యురాలు ప్రాణాలతో ఉండేది. ఈ విషయాలను పోలీసులు తమ రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించారు.

More Telugu News