వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలది నేర చరిత: యనమల రామకృష్ణుడు

పశ్చిమగోదావరి జిల్లా మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ ను ఆ పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఈరోజు పరామర్శించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ, చింతమనేని కళ్లు చింతనిప్పుల్లా వుంటాయని, అందుకే, అధికారపక్షానికి ఆయనంటే భయమని అన్నారు.

ఈ సందర్భంగా సీఎం జగన్ పై, వైసీపీ కేబినెట్ పై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ ఓ ఫ్యాక్షనిస్టు అని, ఆయన పాలన నియంత హిట్లర్ పాలనను తలపిస్తోందని దుయ్యబట్టారు. వైసీపీ కేబినెట్ లో 80 శాతం మంత్రులు, 60 శాతం ఎమ్మెల్యేలు నేర చరిత కలిగిన వాళ్లేనని ఆరోపించారు. అధికారం శాశ్వతం కాదని, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వైసీపీ ప్రభుత్వానికి సూచించిన ఆయన, ఏపీలో మళ్లీ అధికారంలోకి వచ్చేది టీడీపీనే అని ధీమా వ్యక్తం చేశారు.


More Telugu News