రవిప్రకాశ్ పై సీజేఐకు విజయసాయిరెడ్డి లేఖ రాయడంపై కనకమేడల విమర్శలు

టీవీ 9 మాజీ సీఈఓ రవిప్రకాశ్ పై సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ (సీజేఐ)కు లేఖ రాసే నైతిక అర్హత వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి లేదని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ విమర్శించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. సీజేఐకు లేఖ రాయడం ద్వారా కింది కోర్టులో రవిప్రకాశ్ కు బెయిల్ మంజూరు కాకుండా న్యాయవ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తిలో జోక్యం చేసుకోవడం విజయసాయిరెడ్డి దురుద్దేశాలకు రుజువుగా వుందని విమర్శించారు. ఏదైనా ఉంటే కోర్టులో ఫైల్ చేయాలి తప్ప ఈ రకంగా లేఖలు రాయడం న్యాయవ్యవస్థ సహజ సూత్రాలకు విరుద్ధమని అన్నారు.

జగన్ అక్రమాలు ఎండగట్టారన్న కక్షతోనే బ్లాక్ మెయిల్ లేఖలు రాశారని ఆరోపించారు. మనీ లాండరింగ్, సూట్ కేసు కంపెనీలకు ఆద్యుడు విజయసాయిరెడ్డి అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రవిప్రకాశ్ సమస్య టీవీ9 పాత, కొత్త యాజమాన్యాల మధ్య నెలకొన్న సమస్య అని, ఆ వ్యవహారంలో ఏ2 రెడ్డి రాజకీయ జోక్యమెందుకు? అంటూ విజయసాయిరెడ్డిపై ధ్వజమెత్తారు. ఈ లేఖ చూస్తే టీవీ9కు విజయసాయిరెడ్డి స్లీపింగ్ పార్టనరా? అనే అనుమానం కలుగకమానదని అన్నారు.


More Telugu News