Pawan Kalyan: తెలంగాణ, కశ్మీర్ సమస్యల ముందు కాపు రిజర్వేషన్ల అంశం చాలా చిన్నది: పవన్ కల్యాణ్

  • 151 సీట్లు గెలిచిన పార్టీకి అదేమంత పెద్ద సమస్య కాదన్న పవన్
  • బొత్సపైనా విమర్శలు చేసిన జనసేనాని
  • బొత్స తానే సీఎంలా మాట్లాడుతున్నారంటూ వ్యాఖ్యలు
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తూర్పు గోదావరి జిల్లా దిండిలో మీడియాతో మాట్లాడారు. కాపు రిజర్వేషన్ల అంశం చాలా చిన్నదని, కశ్మీర్, తెలంగాణ సమస్యలతో పోల్చితే అదేమంత పెద్దది కాదని అన్నారు. ఎన్నికల్లో 151 సీట్లు గెల్చిన పార్టీ కాపు రిజర్వేషన్ల అంశాన్ని సులువుగా పరిష్కరించగలదని వ్యాఖ్యానించారు.

 ఈ సందర్భంగా ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణపైనా పవన్ కల్యాణ్ విమర్శలు గుప్పించారు. బొత్స తానే ఏపీ ముఖ్యమంత్రి అన్నట్టుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. గతంలో రాష్ట్ర విభజనకు అనుకూలంగా మాట్లాడిన వ్యక్తి బొత్స అని, రాష్ట్రం విడిపోతే తప్పేంటని అన్నాడని పవన్ ఆరోపించారు.

అయినా, రాజధాని అమరావతిని తరలించడం కుదరదని, గత ఐదేళ్లలో అక్కడ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారని వ్యాఖ్యానించారు. పర్యావరణ హిత రాజధాని నిర్మాణమే తమ అభిమతమని జనసేనాని స్పష్టం చేశారు. రాజధాని అమరావతి తరలించాలని తామెప్పుడూ వ్యాఖ్యానించలేదని, రైతుల నుంచి బలవంతంగా భూములు తీసుకోవద్దని మాత్రమే తాము స్పష్టం చేశామని వివరణ ఇచ్చారు.
Pawan Kalyan
Jana Sena
YSRCP
Botsa Satyanarayana
Andhra Pradesh
Amaravathi

More Telugu News