BJP: తండ్రితో కలిసి బీజేపీ తీర్థం పుచ్చుకున్న టీవీ యాంకర్ శ్వేతారెడ్డి

  • కన్నా సమక్షంలో బీజేపీలో చేరిక
  • ప్రజా సమస్యలపై పోరాడతానని స్పష్టీకరణ
  • బిగ్‌బాస్‌పై పోరాటంలో బీజేపీ అండగా నిలిచిందన్న శ్వేతారెడ్డి
బిగ్‌బాస్-3 రియాలిటీ షోపై ఆరోపణలతో సంచలనం రేపిన టీవీ యాంకర్ శ్వేతారెడ్డి బీజేపీలో చేరారు. గుంటూరులో బుధవారం సాయంత్రం ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో ఆమె కాషాయ కండువా కప్పుకున్నారు. ఆమెతోపాటు ఆమె తండ్రి కూడా బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా శ్వేతారెడ్డి మాట్లాడుతూ.. బిగ్‌బాస్ షో పై తాను పోరాడినప్పుడు కొందరు తప్ప ఎవరూ స్పందించలేదని, అలాగే ఏ రాజకీయ పార్టీ కూడా తనకు అండగా నిలబడలేదన్నారు. ఒక్క బీజేపీ, ఆ పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మాత్రమే తనకు అండగా నిలిచారని గుర్తు చేశారు. అలాగే, ఏబీవీపీ కూడా తనకు మద్దతుగా నిలిచిందన్నారు.

బీజేపీలో చేరినందుకు ఆనందంగా ఉందన్న శ్వేతారెడ్డి.. ఇప్పటి వరకు జర్నలిస్టుగా ప్రజాసమస్యలపై గళం వినిపించానని, ఇప్పుడు బీజేపీలో చేరడం ద్వారా ప్రజల కోసం పోరాడతానని చెప్పారు. బిగ్‌బాస్ షోపై పోరాడినట్టుగానే రాష్ట్రంలోని సమస్యలపైనా పోరాడతానని ఆమె స్పష్టం చేశారు.  

More Telugu News

BJP
anchor swethareddy
bigboss