టీడీపీ నేతలపై పోలీసులకు ఫిర్యాదు చేసిన వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి
- వినాయకచవితి వేడుకల్లో ఎమ్మెల్యేకు అవమానం!
- తనను టీడీపీ నేతలు అసభ్యంగా దూషించారంటూ వెల్లడించిన ఉండవల్లి శ్రీదేవి
- ఎన్నికల్లో వైసీపీ విజయాన్ని టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారంటూ వ్యాఖ్యలు
వినాయకచవితి వేడుకల్లో తనను అవమానించారంటూ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి టీడీపీ నేతలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇవాళ వినాయకచవితి సందర్భంగా ఉండవల్లి శ్రీదేవి తుళ్లూరు మండలం అనంతవరం వెళ్లారు. అయితే, అక్కడ వినాయక మంటపం వద్ద తనను టీడీపీ నేతలు అసభ్యపదజాలంతో దూషించారని శ్రీదేవి ఆరోపించారు. ఈ ఘటనపై తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశానని ఆమె వెల్లడించారు. ఎమ్మెల్యేను చూసిన టీడీపీ నేతలు ఆమె ఉత్సవాల్లో పాల్గొంటే వినాయకుడు మైల పడతాడని వ్యాఖ్యలు చేశారు. దాంతో ఆమె కన్నీళ్లు పెట్టుకుని అక్కడి నుంచి నిష్క్రమించారు. ఎన్నికల్లో వైసీపీ విజయాన్ని టీడీపీ నేతలు జీర్ణించుకోలేక ఇటువంటి చర్యలకు దిగుతున్నారని విమర్శించారు.