కేరళను కుదిపేస్తున్న వర్షాలు.. పాఠశాలలకు సెలవులు.. పలు జిల్లాల్లో రెడ్ అలెర్ట్!

గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో కేరళ అతలాకుతలం అవుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు రాష్ట్రం చిగురుటాకులా వణుకుతోంది. నిలువ నీడ కరువై ప్రజలు అల్లాడిపోతున్నారు. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. పలు జిల్లాల్లో రోడ్లు తెగి ప్రజా సంబంధాలు దెబ్బతిన్నాయి. కమ్యూనికేషన్ వ్యవస్థ మొరాయిస్తోంది. వర్షాల కారణంగా ఇప్పటి వరకు 21 మంది మృత్యువాత పడ్డారు. సోమవారం ఉదయానికి మొత్తం 13 సహాయక శిబిరాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

వర్షాలు తగ్గుముఖం పట్టకపోవడంతో కన్నూరు, కొట్టాయం, కోజికోడ్‌లలో సోమవారం పాఠశాలలకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం మంగళవారం కసర్‌గోడ్, మలప్పురం జిల్లాల్లోనూ స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. కోజికోడ్‌, మల్లపురం, వయనాడ్ జిల్లాలో ఆరెంజ్ అలెర్ట్ జారీ చేయగా, పాలక్కాడ్‌, త్రిసూర్, ఎర్నాకుళం, ఇడుక్కి జిల్లాల్లో యెల్లో అలెర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.


More Telugu News