150 సంవత్సరాల తరువాత గురుపౌర్ణమి రోజు గ్రహణం... ఎవరు చూడవచ్చు? ఎవరు చూడకూడదు?

దాదాపు 150 సంవత్సరాల తరువాత గురుపౌర్ణమి నాడు చంద్రగ్రహణం వస్తోంది. 1870, జూలై 12 తరువాత గురుపౌర్ణమి నాడు గ్రహణం ఏర్పడటం ఇదే తొలిసారి. ఈ గ్రహణం సందర్భంగా కొన్ని రాశుల వారు జాగ్రత్తలు తీసుకోవాలని జ్యోతిష పండితులు సూచిస్తున్నారు.

గ్రహణం నేటి రాత్రి ఉత్తరాషాఢ నక్షత్రం తొలిపాదంలో అంటే అర్ధరాత్రి 1.31 గంటలకు ధనస్సు రాశిలో ప్రారంభమై,  అదే నక్షత్రం రెండో పాదంలో, తెల్లవారుజామున 4.29 నిమిషాలకు మకర రాశిలో ముగుస్తుంది. ఈ గ్రహణం ఇండియాలో పాక్షికంగానే కనిపిస్తుంది.

అయితే, రాహువు, శని, చంద్రుడితో కలిసి ధనస్సు రాశిలో ఉన్న సమయంలో గ్రహణం వస్తున్నందున ఆయా రాశులు, నక్షత్రాలను బట్టి, అధమ, మధ్యమ, విశేష ఫలితాలు కలగనున్నాయని పండితులు అంటున్నారు. వృషభ, మిథున, కన్య, ధనుస్సు, మకర రాశుల వారికి అధమ ఫలితాలను, తుల, కుంభ రాశుల వారికి మధ్యమ ఫలితాలు, మేష, కర్కాటక, వృశ్చిక, సింహ, మీన రాశుల వారికి విశేష ఫలం లభిస్తుందని చెబుతున్నారు.

ఇక ఈ గ్రహణాన్ని పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణ నక్షత్రాల్లో పుట్టినవారు, ధనుస్సు, మకర రాశులకు చెందిన వారు చూడవద్దని జ్యోతిష్యులు సూచిస్తున్నారు. అయితే, గ్రహణం అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము మధ్య ఉండటంతో, ఆ సమయంలో అత్యధికులు నిద్రలో ఉంటారు కాబట్టి, పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.


More Telugu News