క్లీన్ గవర్నెన్స్ ను అందించేందుకు జగన్ కంకణం కట్టుకున్నారు: సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రమేశ్
పరిపాలనపై ముఖ్యమంత్రి జగన్ కు స్పష్టమైన అవగాహన ఉందని సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్ అన్నారు. సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డ అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ, భవిష్యత్ లో ఓ మంచి సమాజాన్ని నిర్మించాలని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలన్నది సీఎం జగన్ ఆకాంక్ష అని అన్నారు. ఈ విషయాన్ని ‘నవరత్నాలు’ లో జగన్ స్పష్టంగా చెప్పడం జరిగిందని గుర్తు చేశారు. ‘నవరత్నాలు’ను జగన్ సమర్ధంగా అమలు చేస్తారని అభిప్రాయపడ్డారు. ఆరోగ్య శ్రీ పథకం అధ్వాన స్థితిలో ఉన్నట్టు పలు నివేదికలు చెబుతున్నాయని, ఈ పథకం అమలుకు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటామని అన్నారు. పారదర్శకంగా, నిజాయతీగా, క్లీన్ గవర్నెన్స్ ను అందించేందుకు జగన్ కంకణం కట్టుకున్నారని స్పష్టం చేశారు.