మొన్న ఆరోపణలతో, నేడు పొగడ్తలతో... నరేంద్ర మోదీపై రెండు వారాల్లోనే మారిన 'టైమ్' మేగజైన్ వైఖరి!

  • రెండు వారాల వ్యవధిలో మాట మార్చిన 'టైమ్'
  • కుల, మత, వర్గ సమీకరణలను అధిగమించారని పొగడ్తలు
  • క్షేత్రస్థాయిలో పరిస్థితులను సరిగ్గా అంచనా వేయని పశ్చిమ మీడియా
'టైమ్'... అమెరికా కేంద్రంగా వెలువడే ప్రముఖ పత్రిక. ఈ పత్రికలో భారత ప్రధాని నరేంద్ర మోదీపై రెండు వారాల క్రితం ఓ కథనం వచ్చింది. 'ఇండియాస్‌ డివైడర్‌ ఇన్‌ చీఫ్‌' (భారత విభజన సారథి) అంటూ ఆ పత్రిక ప్రచురించిన కథనం కలకలం రేపింది. ఆపై పది రోజులు గడవగానే ఎన్నికల ఫలితాలు వచ్చాయి. మోదీ సర్కారు అపూర్వ ప్రజాదరణతో మరోసారి గద్దెనెక్కేందుకు సిద్ధమైన వేళ, మాట మారుస్తూ,  గత ఐదేళ్లలో మోదీలా దేశాన్ని ఎవ్వరూ ఏకం చేయలేకపోయారంటూ మరో బ్యానర్ కథనాన్ని ప్రచురించింది. రెండు వారాల క్రితం మోదీని విమర్శిస్తూ ప్రచురించిన కథనాన్ని పాకిస్థాన్ మూలాలున్న ఆతీష్‌ తసీర్‌ రాయగా, తాజా కథనాన్ని భారత్‌ కు చెందిన మనోజ్‌ లాద్వా రాయడం గమనార్హం.

మోదీ భారీ విజయం తరువాత రూటు మార్చుకున్న పత్రిక, ఆయన విభజన వాది కాదని, దేశాన్ని ఏకతాటిపైన నడిపించిన నేతని ప్రశంసించింది. కుల, మత, వర్గ సమీకరణల్ని అధిగమించిన ఆయన, సీట్లు, ఓట్లను పెంచుకుని మరీ తిరిగి అధికారాన్ని నిలబెట్టుకున్నారని విశ్లేషించింది. ఇండియాలో నెలకొన్న క్షేత్రస్థాయి పరిస్థితుల్ని అంచనా వేయడంలో పశ్చిమ దేశాల మీడియా విఫలమైందని అభిప్రాయపడ్డ మనోజ్, మోదీ అధికారంలోకి వచ్చాక అగ్రకులాల ఆధిపత్యం పెరిగిందని భావించడం అవాస్తవమని అన్నారు. పేదలు అత్యధికంగా ఉన్న ఇండియాలో, మోదీ సంక్షేమ పథకాలే మరోసారి అధికారాన్ని దగ్గర చేశాయని 'టైమ్' పేర్కొంది.
Go Back to Shorts
Narendra Modi
TIME

More Telugu News