Gul Muhammad Mir: బీజేపీ నేతను కాల్చి చంపిన ఉగ్రవాదులు

  • చాతీలో బుల్లెట్లు దింపిన ఉగ్రవాదులు
  • ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే మృతి
  • తీవ్రంగా ఖండించిన మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా

జమ్మూకశ్మీర్‌కు చెందిన బీజేపీ నేత గుల్ మొహమ్మద్ మిర్‌ (60)ను ఉగ్రవాదులు కాల్చి చంపారు. దక్షిణ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా నౌగామ్‌లో శనివారం సాయంత్రం జరిగిందీ ఘటన. మిర్‌ చాతీలోకి బుల్లెట్లు దూసుకెళ్లాయని పోలీసులు తెలిపారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించామని అయితే, అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారన్నారు.

మిర్ హత్యను పలువురు నేతలు తీవ్రంగా ఖండించారు. నేషనల్ కాన్ఫరెన్స్ నేత, మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ.. ఉగ్రవాదుల చర్య హేయమన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు. కాగా, 2008, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన మిర్ ఓటమి పాలయ్యారు.

More Telugu News