‘ఫణి’ వచ్చేస్తోంది.. హెచ్చరించిన వాతావరణ శాఖ.. జాలర్లు తీరం చేరుకోవాలని హెచ్చరిక
- తీవ్ర వాయుగుండంగా మారిన వాయుగుండం
- 29న తీవ్ర తుపానుగా మారనున్న వైనం
- 30 నుంచి దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు
మచిలీపట్టణానికి 1690 కిలోమీటర్ల దూరంలో, శ్రీలంకలోని ట్రింకోమలికి 1060 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి 1410 కిలోమీట్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉందన్న అధికారులు ఈ ఉదయం అది తీవ్ర వాయుగుండంగా మారి, 5:30 గంటల ప్రాంతంలో తుపానుగా మారినట్టు తెలిపారు. 29న అది తీవ్ర తుపానుగా మారుతుందని, దీని ప్రభావంతో 30న దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. నేటి నుంచి గంటకు 135 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ తీరాన్ని తాకే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ తుపానుకు ‘ఫణి’ అని పేరు పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. తుపాను నేపథ్యంలో జాలర్లు వేటకు వెళ్లొద్దని, ఇప్పటికే సముద్రంలో ఉన్నవారు ఆదివారం లోగా తీరానికి చేరుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.