ఏకైక దుర్మార్గపు పార్టీ వైసీపీ: ప్రత్తిపాటి ఫైర్

  • సమీక్షలు నిర్వహించకుండా అడ్డు తగలడం దారుణం
  • ఎన్నికల కోడ్ పేరిట కుంటి సాకులు తగదు
  • చంద్రబాబుకు అడుగడుగునా అడ్డు పడుతున్నారు
ఎన్నికల కోడ్ పేరిట సమీక్షలు నిర్వహించకుండా ఏపీ సీఎం చంద్రబాబుకు అడ్డుతగలడం దారుణమని టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. గుంటూరులో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల కోడ్ పేరిట కుంటి సాకులు చెప్పి చంద్రబాబుకు అడుగడుగునా అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. సమీక్షలు నిర్వహిస్తే ఓర్చుకోలేక పోతోందని, పాలనను స్తంభింపజేస్తున్న ఏకైక దుర్మార్గపు పార్టీ వైసీపీ అని దుమ్మెత్తిపోశారు.

ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా ప్రజల కష్టాలు తీర్చేందుకు చంద్రబాబు పని చేస్తుంటే, ఇందుకు ఓర్వలేని వైసీపీ నేతలు అడ్డుతగులుతున్నారని ధ్వజమెత్తారు. రైతులకు ‘పోలవరం’ నీళ్లు అందించేందుకు, ప్రజల తాగునీటి సమస్యపై, రైతుల ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష చేస్తే ఎన్నికల కోడ్ అంటూ ఆటంకాలు సృష్టించడం మంచి పద్ధతి కాదని అన్నారు. ప్రజల కష్టాలు పట్టని జగన్ విదేశాలకు వెళ్లిపోయాడని విమర్శించారు.

ఎన్నడూ లేనివిధంగా ఈసీ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతోందని మండిపడ్డారు. పలు కేసుల్లో నిందితులుగా ఉన్న వాళ్లు ఫిర్యాదు చేస్తే ఎన్నికల సంఘం వెంటనే స్పందించిందని, టీడీపీ ఇచ్చిన ఫిర్యాదులపై ఎందుకు స్పందించలేదని నిలదీశారు. బీజేపీతో, జగన్ తో కలిసిపోయిన ఈసీ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు.

Telugudesam
pratipati
pulla rao
Elections

More Telugu News