ప్రపంచపటంలో నవ్యాంధ్రప్రదేశ్ ను పెడతాను: సీఎం చంద్రబాబు

ప్రపంచపటంలో నవ్యాంధ్రప్రదేశ్ ను పెడతానని, అందుకోసం అహర్నిశలు పాటుపడతానని సీఎం చంద్రబాబునాయుడు మరోసారి హామీ ఇచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలో నిర్వహిస్తున్న టీడీపీ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర విభజన తర్వాత కట్టుబట్టలతోనే కాదు నెత్తిమీద అప్పులు పెట్టుకుని మరీ వచ్చామని గుర్తు చేశారు.

నాడు హైదరాబాద్ ను ప్రపంచపటంలో చేర్చిన ఘనత తనదేనని, అదే స్ఫూర్తి, అదే కసితో నవ్యాంధ్రప్రదేశ్ కు ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకొచ్చేందుకు అహర్నిశలు కష్టపడతానని అన్నారు. ఈ ఐదేళ్లలో రాష్ట్రంలో సుపరిపాలన ఇచ్చామని, పేదల కష్టాలు చూసి పింఛన్ మొత్తం పదిరెట్లు పెంచామని, వృద్ధులంతా ఈ పెద్దకొడుకు ఉన్నాడన్న ధైర్యంతో ఉన్నారని చెప్పారు. ఏపీ అభివృద్ధికి కేసీఆర్, జగన్ అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. జగన్ ఇప్పటికీ అమరావతికి రాలేదని, హైదరాబాద్ లోనే ఉన్నారని విమర్శించారు.


More Telugu News