ఉగ్రదాడులపై సాక్ష్యాలు కావాలా? బాలాకోట్ కు వెళ్లి చూడండి!: కాంగ్రెస్ కు కేంద్ర మంత్రి రాథోడ్ చురకలు

  • బాలాకోట్ దాడికి సాక్ష్యాలు చూపాలన్న కాంగ్రెస్
  • దాడిలో ఎవ్వరూ చనిపోలేదన్న కపిల్ సిబాల్
  • కాంగ్రెస్ వ్యాఖ్యలకు దీటుగా కౌంటర్ ఇచ్చిన కేంద్ర మంత్రి
పాకిస్థాన్ లోని బాలాకోట్ లో ఉన్న జైషే ఉగ్రవాద స్థావరంపై భారత వాయుసేన(ఐఏఎఫ్) దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో సుమారు 350 మంది ఉగ్రవాదులు చనిపోయినట్లు ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. అయితే భారత దాడిలో 250 మంది ముష్కరులు చనిపోయారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలిపారు.

ఈ నేపథ్యంలో అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం మొదలయింది. బీజేపీ ఉగ్రవాదుల ఏరివేతను రాజకీయం చేస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈ సందర్భంగా బాలాకోట్ దాడిలో ఒక్క ఉగ్రవాది కూడా చనిపోలేదని అంతర్జాతీయ మీడియా ప్రచురించిన కథనాలను కాంగ్రెస్ నేత కపిల్ సిబాల్ ప్రస్తావించారు.

దీంతో సిబాల్ పై కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. భారత బలగాల కంటే విదేశీ మీడియాను ఎక్కువగా నమ్ముతున్నారా? అని సిబాల్ ను సూటిగా ప్రశ్నించారు. ట్విట్టర్ లో రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ స్పందిస్తూ..‘కపిల్ సిబాల్ గారూ.. మీరు మన బలగాల మాటను కాదని అంతర్జాతీయ మీడియా కథనాలను విశ్వసిస్తున్నారా?

బాలాకోట్ దాడిలో ఎవ్వరూ చనిపోలేదు అని మీరు చెప్పిన మాటలను మీడియా ప్రచురించగానే మీరు చాలా సంతోషంగా ఉన్నట్లు కనిపించారు. ఈవీఎంల హ్యాకింగ్ పై నిజాలను తెలుసుకునేందుకు మీరు లండన్ వెళ్లారు కదా. ఇప్పుడు ఉగ్రదాడిపై వాస్తవాలను తెలుసుకునేందుకు బాలాకోట్ కు కూడా వెళ్లండి’ అని చురకలు అంటించారు.
Go Back to Shorts
India
Pakistan
terror attack
Congress
sibal
BJP
rathod
Twitter

More Telugu News