మోదీ రాక నేపథ్యంలో విశాఖలో బీజేపీ-టీడీపీల మధ్య ఫ్లెక్సీ వార్
- నేడు విశాఖలో మోదీ భారీ బహిరంగ సభ
- ఎక్కడికక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి టీడీపీ నిరసన
- తొలగించిన బీజేపీ కార్యకర్తలు
మోదీకి నల్లజెండాలతో నిరసన తెలపాలని విభజన హామీల సాధన సమితి ఇప్పటికే ఓ నిర్ణయానికి రాగా, జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ నిరసనలు తెలపాలని టీడీపీ నిర్ణయించింది. ఏపీకి ప్రత్యేక హోదా, హుద్ హుద్ రిలీఫ్ ఫండ్స్, కేకే లైన్తో కూడిన రైల్వేజోన్ కేటాయించాలంటూ నగరంలో భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వీటిని బీజేపీ కార్యకర్తలు తొలగించారు. వారు ఏర్పాటు చేయడం.. వీరు తొలగించడం నగరంలో రెండు రోజులుగా ఈ ఫ్లెక్సీవార్ జోరందుకుంది.
అలాగే, విశాఖ - చెన్నై పెట్రో కారిడార్కు నిధులు ఇవ్వాలని, హుద్హుద్ తుపాను సాయం కింద ఇస్తామన్న రూ.1000 కోట్లు ఇవ్వాలని, కేకే లైన్తో కూడిన విశాఖ రైల్వే జోన్ను ఇవ్వాలంటూ మోదీ దృష్టిని ఆకర్షించేలా భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వీటిని బీజేపీ కార్యకర్తలు తొలగిస్తుండగా, టీడీపీ కార్యకర్తలు, నిరసనకారులు అడ్డుకున్నారు.