సినీ నటుడు పృథ్వీకి నాగబాబు వార్నింగ్.. అనుమానాలుంటే తనకే ఫోన్ చేయాలని హితవు!
- నాగబాబు ఇచ్చిన విరాళంపై పృథ్వీ వివాదాస్పద వ్యాఖ్యలు
- పృథ్వీ వద్ద తన ఫోన్ నెంబర్ ఉందన్న నాగబాబు
- విరాళం అధికారికమేనని స్పష్టీకరణ
వరుణ్తేజ్తో కలిసి నాగబాబు ఇటీవల రూ.1.25 కోట్లను జనసేనకు విరాళంగా ఇచ్చాడు. ఇటీవల పృథ్వీ మాట్లాడుతూ.. పన్ను ఎగ్గొట్టేందుకే ఈ సొమ్మును విరాళంగా ఇచ్చారని పేర్కొన్నారు. ఎక్కడి నుంచో తెచ్చిన సొమ్మును నాగబాబు తన కొడుకు ఖాతాలో వేసి దానిని జనసేనకు విరాళంగా ఇచ్చారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
పృథ్వీ వ్యాఖ్యలపై తాజాగా స్పందించిన నాగబాబు.. అతడలా అన్నాడంటే నమ్మలేకుండా ఉన్నానని, ఒకవేళ అని ఉంటే మాత్రం వ్యక్తిగతంగా కలిసి మరీ సమాధానం చెబుతానని హెచ్చరించాడు. పృథ్వీ దగ్గర తన ఫోన్ నంబరు ఉందని, అతడికేమైనా అనుమానాలుంటే తనకు నేరుగా ఫోన్ చేసి అడగొచ్చని సూచించాడు. జనసేనకు తామిచ్చిన విరాళం అధికారికమేనని నాగబాబు స్పష్టం చేశాడు. తమ కుటుంబంపై బురద జల్లడం ఇది కొత్తకాదని ముక్తాయింపు ఇచ్చాడు.