రాష్ట్రపతి చేతుల మీదుగా పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో వాజ్‌పేయి చిత్రపటం ఆవిష్కరణ

దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన మాజీ ప్రధాని, దివంగత అటల్‌ బిహారీ వాజ్‌పేయీ అనారోగ్యంతో బాధపడుతూ గతేడాది ఆగస్టు 16న తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆయన నిలువెత్తు చిత్రపటాన్ని ఈ రోజు పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దీనిని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ.. వాజ్‌పేయి సేవలను గుర్తు చేసుకున్నారు. ఇప్పటి నుంచి అటల్ జీ తమను ఆశీర్వదిస్తారని.. స్ఫూర్తినిస్తారని పేర్కొన్నారు.

అటల్ జీ ప్రసంగంలో ఓ శక్తి ఉంటుందని.. ఆయనో గొప్ప నేత అని కొనియాడారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎక్కువ కాలం ప్రతిపక్షంలోనే ఉన్నారని.. అయినా పదవిని ఆశించకుండా ప్రజల సమస్యలను లేవనెత్తేవారన్నారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ తన సిద్ధాంతాలను వదలని గొప్ప వ్యక్తి వాజ్‌పేయి అని కొనియాడారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహజన్‌, మాజీ ప్రధాని దేవెగౌడ, కేంద్రమంత్రులు పలు పార్టీల ఎంపీలు ఈ కార్యక్రమానికి హాజరై వాజ్‌పేయీకి నివాళులర్పించారు.


More Telugu News