బీజేపీని వీడి జనసేనలోకి ఎమ్మెల్యే ఆకుల!
- పార్టీ మారనున్న మాట వాస్తవమే
- 21న జనసేన తీర్థం
- ఆకులకు పార్లమెంట్ స్థానం
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి అర్బన్ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ పార్టీకి స్వస్తి చెప్పనున్నట్టు తెలుస్తోంది. ఆయన పార్టీ మారనున్నారంటూ గత కొన్నాళ్లుగా జరుగుతున్న ప్రచారం వాస్తవమేనని ఆయన అనుచరులు తెలిపారు. త్వరలోనే ఆకుల తన అనుచరులతో కలిసి జనసేన పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నట్టు సమాచారం. రానున్న ఎన్నికల్లో ఆకులకు రాజమండ్రి లోక్ సభ స్థానం... ఆయన భార్య పద్మావతికి రాజానగరం అసెంబ్లీ స్థానం కేటాయించేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ అంగీకరించినట్టు తెలుస్తోంది. దీంతో ఆకుల ఈ నెల 21న అధికారికంగా జనసేనలో చేరుతారని అంటున్నారు.