Karnataka: పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన బీజేపీ ఎమ్మెల్యే... కర్ణాటకలో కలకలం!
కర్ణాటకలోని హోసదుర్గ నియోజకవర్గ ఎమ్మెల్యే, బీజేపీ నేత గూలిహట్టి శేఖర్, తన ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడబోవడం తీవ్ర కలకలం రేపింది. తన అనుచరులను పోలీసులు అక్రమంగా కేసుల్లో ఇరికిస్తున్నారని ఆరోపించిన ఆయన హోసదుర్గ పోలీసు స్టేషన్ వద్దకు తన మద్దతుదారులతో వచ్చి నిరసన తెలిపారు. ఇసుక అక్రమ రవాణా కేసుల్లో తనవారిని ఇరికించి, ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించిన ఆయన, ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోబోయారు. ఆయన్ను బలవంతంగా అడ్డుకున్న పోలీసులు, స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.