పెళ్లి చేసుకుని బంగారం, డబ్బుతో పారిపోయే కిలేడీ... ఆరుగురిని పెళ్లాడిన మౌనిక అరెస్ట్!
- పుట్టింటికని వెళ్లి మెట్టినింటిని వెతుక్కునే మౌనిక
- వెళుతూ వెళుతూ అందినంత బంగారం, డబ్బు దోపిడీ
- కడప వాసి ఫిర్యాదుతో పోలీసుల విచారణ
- నివ్వెరపోయే నిజాలు వెలుగులోకి
మరిన్ని వివరాల్లోకి వెళితే, ప్రకాశం జిల్లా మొయిద్దీనాపురంకు చెందిన అనంతరెడ్డి కుమార్తె మౌనిక. తాము పేదలమని, కట్న కానుకలు ఇచ్చుకోలేమని చెబుతూ, డబ్బున్న సంబంధాలను ఆమె తండ్రి చూసేవాడు. అమ్మాయి అందంగా ఉండటంతో కట్నకానుకలపై ఆశలేని వారు ఆమెను పెళ్లి చేసుకునేవారు. ఆపై మెట్టినింటికి వెళ్లే మౌనిక, చాలా బాగా ఉండేది. భర్త మురిపెం సాంతం తీరకుండానే, బంగారం, డబ్బుతో ఉడాయించేది. ఆమె ఇంటికి వచ్చే తండ్రితో కలసి పుట్టింటికి బయలుదేరే ఆమె, ఇక మళ్లీ రాదు.
తీసుకున్న బంగారం, నగలతో కలసి, తన ప్రియుడు నాయక్ ను వెంటబెట్టుకుని హైదరాబాద్ చేరుకునే మౌనిక, కొద్ది రోజులు జల్సా చేసి, మరో పెళ్లికి సిద్ధమయ్యేది. కడపకు చెందిన రామకృష్ణారెడ్డి, 8 తులాల బంగారు నగలు, రూ. 30 వేల నగదు ఇచ్చి మరీ బస్టాండు వరకూ వచ్చి ఆమెను బస్సెక్కించాడు. ఆపై మామకు ఫోన్ చేస్తే స్పందన లేకపోవడం, పుట్టింటికి భార్య చేరకపోవడంతో పోలీసు కేసు పెట్టడంతో, పోలీసులు విచారించగా, ఈ నివ్వెరపోయే వివరాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో మౌనిక ఆటను కట్టించారు. మైదుకూరులో మౌనికను, హైదరాబాద్ లో నాయక్ ను, కడపలో అనంతరెడ్డిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు.