CBI: ‘సీబీఐ’ కుమ్ములాటలపై కాంగ్రెస్ దేశవ్యాప్త ఆందోళన.. స్వయంగా పాల్గొన్న పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ!

  • దేశవ్యాప్తంగా సీబీఐ ఆఫీసుల ముందు ధర్నా
  • వాటర్ కేనన్లు, బాష్పవాయు గోళాల ప్రయోగం
  • అలోక్ తొలగింపుపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు
కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) డైరెక్టర్ అలోక్ వర్మ, స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ అస్థానాలను సెలవుపై పంపడం పట్ల వివాదం మరింతగా ముదురుతోంది. తాజాగా అలోక్ వర్మ తొలగింపును వ్యతిరేకిస్తూ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఉన్న సీబీఐ కార్యాలయాల ఎదుట ఆందోళనకు దిగింది. ఢిల్లీలోని దయాళ్ సింగ్ కళాశాల నుంచి సీబీఐ కేంద్ర ప్రధాన కార్యాలయం వరకూ కాంగ్రెస్ శ్రేణులు ర్యాలీ నిర్వహించాయి. ఈ ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పాల్గొన్నారు.

ఆందోళనల్లో భాగంగా కాంగ్రెస్ కార్యకర్తలు బారికేడ్లను దూకి సీబీఐ ఆఫీసుల్లోకి వెళ్లేందుకు యత్నించారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు వాటర్ కేనన్లు, బాష్పవాయువును ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు సీబీఐ చీఫ్ అలోక్ వర్మపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి రెండు వారాల్లో విచారణను పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర విజిలెన్స్ కమిషన్ కు సుప్రీంకోర్టు ఈ రోజు ఆదేశాలు జారీ చేసింది.

ఈ విచారణను సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఏకే పట్నాయక్ పర్యవేక్షిస్తారని తెలిపింది. తదుపరి విచారణను నవంబర్ 12వ తేదీకి వాయిదా వేసింది. సీబీఐ డైరెక్టర్ గా తనను తప్పించడంపై అలోక్ వర్మ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. అలాగే కొత్తగా సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన మన్నెం నాగేశ్వరరావు ఎలాంటి విధాన పరమైన నిర్ణయాలు తీసుకోరాదని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.
CBI
Congress
Supreme Court
agitation
alok verma
rakesh asthana
Police
water canon
tear gas
Rahul Gandhi
Hyderabad

More Telugu News