ఏపీ మాజీ గవర్నర్ ఎన్డీ తివారీ మృతికి రఘువీరారెడ్డి సంతాపం
- తివారీ కుటుంబసభ్యులకు సానుభూతిని తెలియజేసిన రఘువీరా
- తివారీ ఆత్మకు శాంతి చేకూరాలంటూ కోరిక
- 93 ఏళ్ల వయసులో కన్నుమూసిన తివారీ
ఏపీ మాజీ గవర్నర్ ఎన్డీ తివారీ (93) మృతి పట్ల ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. తివారీ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తివారీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. దేశానికి తివారీ చేసిన సేవలు చాలా గొప్పవని కొనియాడారు. ఢిల్లీలోని మ్యాక్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన వయసు 93 సంవత్సరాలు. పుట్టినరోజు నాడే ఆయన కన్నుమూయడం గమనార్హం. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా తివారీ మూడు పర్యాయాలు పని చేశారు. ఒకసారి ఉత్తరాఖండ్ సీఎంగా బాధ్యతలను నిర్వహించారు. కేంద్ర ఆర్థిక మంత్రిగా, విదేశాంగ మంత్రిగా పని చేసిన ఆయన... 2007 ఆగస్టు 22 నుంచి 2009 డిసెంబర్ 26 వరకు ఏపీ గవర్నర్ గా వ్యవహరించారు.