గుజరాత్లో ప్రాంతీయత చిచ్చు... వలస కార్మికులపై దాడులు.. 342 మంది అరెస్టు!
- రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు
- రిజర్వ్ పోలీసు బలగాలను మోహరించిన అధికారులు
- సాబర్కాంఠా జిల్లాలో బాలికపై అత్యాచారం ఘటనతో చిచ్చు
స్థానికేతరులపై దాడులకు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఇప్పటి వరకు 342 మందిని పోలీసులు అరెస్టు చేశారు. గత నెల 28వ తేదీన సాబర్కాంఠా జిల్లాలో మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది. ఈ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఇతను బీహార్కు చెందిన వ్యక్తి. ఇతని అరెస్టు జరిగిన మర్నాడే సాబర్కాంఠా, గాంధీనగర్, అహ్మదాబాద్, పటన్, మెహసన జిల్లాల్లో హింస చెలరేగింది.
దీంతో ఈ అత్యాచారం ఘటన నేపథ్యంలో ఈ దాడులు జరుగుతున్నాయని భావిస్తున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా ఉండడంతో ఉత్తరప్రదేశ్, బీహార్ నుంచి ఉపాధి వెతుక్కుంటూవచ్చిన వందలాది మంది కార్మికులు గుజరాత్ను వదిలి వెళ్లిపోతున్నారు. అయితే దసరా, దీపావళి సందర్భాల్లో ఇలా కూలీలు సొంత ఊర్లకు వెళ్లడం మామూలేనని, దాడులు కారణం కాదని పోలీసులు చెబుతున్నారు.