రక్షిత్ తో నా పెళ్లి ఎందుకు క్యాన్సిల్ అయిందంటే.. స్పందించిన రష్మిక మందన!

  • తల్లిదండ్రులతో నాకు చనువు ఎక్కువ
  • అమ్మను అప్పుడప్పుడూ ఆట పట్టిస్తుంటా
  • తప్పులను తల్లిదండ్రులు మాత్రమే గుర్తిస్తారని వ్యాఖ్య
ఛలో, గీతగోవిందం, దేవదాస్ వంటి వరుస హిట్లతో రష్మిక మందన దూసుకుపోతుంది. ఈ అమ్మడి కెరీర్ ఇప్పుడు టాప్ గేర్ లో వెళుతోంది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన రష్మిక పలు అంశాలపై ముచ్చటించింది. అమ్మానాన్నలతో తనకు చనువు ఎక్కవని తెలిపింది. తనకు బాయ్ ఫ్రెండ్ ను చూడాల్సిందిగా అమ్మను సరదాగా ఆటపట్టిస్తూ ఉంటానని వెల్లడించింది. అమ్మ కూడా దీన్ని సరదాగా తీసుకునేదని వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా రక్షిత్ తో తన బ్రేకప్ పై స్పందించింది.

తొలి సినిమా ‘కిరిక్ పార్టీ’ లో హీరోగా నటించిన రక్షిత్ శెట్టిపై అభిమానం ఏర్పడిందని రష్మిక తెలిపింది. అది ప్రేమగా మారడంతో నిశ్చితార్థం చేసుకున్నామని వెల్లడించింది. ప్రేమ విషయాన్ని అమ్మకు చెప్పాననీ, ‘నేను తీసుకున్నది సరైన నిర్ణయమేనా?’ అని అడిగినట్లు వెల్లడించింది. దీంతో ‘నీ ఇష్టం.. నీకేది అనిపిస్తే అది చేయ్’ అని చెప్పిందని పేర్కొంది.

కానీ తన ప్రేమకథ మాత్రం నిశ్చితార్థంతోనే ఆగిపోయిందని రష్మిక వ్యాఖ్యానించింది. వయసులో ఉన్నప్పుడు మన కంటికి అన్నీ మంచిగానే కనిపిస్తాయనీ, తల్లిదండ్రులు మాత్రమే తమ పిల్లలకు ఏది మంచిదో గుర్తించగలరని రష్మిక చెప్పింది. ‘అంతా బాగా ఉన్నప్పుడు ఓ బంధాన్ని ముందుకు తీసుకెళ్లవచ్చు. కానీ పొరపాట్లు, లోటుపాట్లు కనిపిస్తే, దాన్ని అక్కడితో వదిలేయడం మంచిది. లేదంటే భవిష్యత్ లో చాలా కోల్పోతాం’ అని వ్యాఖ్యానించింది.
Go Back to Shorts
Tollywood
rashmika
rakshit
geeta govindam
devadas
marriage
engagement

More Telugu News