రెండు గంటల ప్రయాణం ఇక గంటసేపే... అమీర్ పేట - ఎల్బీనగర్ మధ్య మెట్రో స్టేషన్ల వివరాలు!

  • జాతికి అంకితమైన అమీర్ పేట - ఎల్బీ నగర్ మెట్రో మార్గం
  • ప్రారంభించిన నరసింహన్, కేటీఆర్
  • రూ. 60కే ఈ చివరి నుంచి ఆ చివరకు
  • ఏసీ బస్సు చార్జ్ తో పోలిస్తే తక్కువే
మియాపూర్, ఎల్బీనగర్... హైదరాబాద్ కు ఓ చివర మియాపూర్ ఉంటే, మరో చివర ఎల్బీనగర్ ఉంటుంది. ఈ రెండు ప్రాంతాల మధ్యా బస్సులో ప్రయాణం చేయాలంటే కనీసం రెండు గంటల సమయం పడుతుంది. బైక్ పై వెళితే, గంటన్నర సమయాన్ని కేటాయించక తప్పదు. అటువంటి ప్రయాణాన్ని గంటకులోపే పూర్తి చేసే అవకాశం ఇప్పుడు హైదరాబాదీలకు చేరువైంది.

కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ మెట్రో రెండో దశగా, అమీర్ పేట నుంచి ఎల్బీ నగర్ వరకూ మెట్రో రైలును గవర్నర్ నరసింహన్, మంత్రి కేటీఆర్ తదితరులు ప్రారంభించారు. మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ కు మెట్రో రైలు 52 నిమిషాల్లోనే ప్రయాణిస్తుందని అధికారులు తెలిపారు. ఈ రూట్ లో 18 రైళ్లు తిరుగుతూ ఉంటాయని, ప్రస్తుతం ప్రతి 5 నిమిషాలకూ ఓ రైలును అందుబాటులో ఉంచేలా ప్రణాళికలు రూపొందించామని అన్నారు.

ఈ రెండు స్టేషన్ల మధ్యా 16 కిలోమీటర్ల దూరం ఉండగా,  పంజాగుట్ట, ఎర్రమంజిల్, ఖైరతాబాద్, లక్డీకపూల్, అసెంబ్లీ, నాంపల్లి, గాంధీభవన్, ఉస్మానియా మెడికల్ కాలేజ్, ఎంజీబీఎస్ జంక్షన్, మలక్ పేట, న్యూ మలక్ పేట, మూసారంబాగ్, దిల్ సుఖ్ నగర్, చైతన్యపురి, విక్టోరియా మెమోరియల్ స్టేషన్లు ఉన్నాయి.

ఇక ఏసీ బస్సులో కూర్చుని మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ వెళ్లాలంటే రూ. 78 చెల్లించాల్సివుంటుంది. అదే మెట్రోలో రూ. 60కే చేరుకోవచ్చు. పైగా వేగంగా కూడా వెళ్లవచ్చు. మధ్యలో నాంపల్లి రైల్వే స్టేషన్, ఎంజీబీఎస్ ఉండటంతో దూరప్రాంతాల నుంచి రైల్వే స్టేషన్, బస్టాండ్ లకు చేరుకునే ప్రయాణికులతో మెట్రోకు మరింత ప్రజాదరణ ఉంటుందని అంచనా.
Go Back to Shorts
Ameerpet
LB Nagar
Metro
Hyderabad
KTR
Narasimhan

More Telugu News