కశ్మీర్ లో ఉగ్రవాదులకు భారీ ఎదురుదెబ్బ.. టాప్ కమాండర్ ని మట్టుబెట్టిన భద్రతా బలగాలు!
- అనంతనాగ్ జిల్లాలో ఎన్ కౌంటర్
- ఇద్దరు హిజ్బుల్ ఉగ్రవాదుల హతం
- ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిపివేత
కశ్మీర్ లో పోలీసులు, ప్రభుత్వ బలగాలపై దాడులకు వ్యూహాలు రచించడంలో ఖచ్రూ కీలకంగా వ్యవహరించాడు. గత 11 ఏళ్లుగా భద్రతా బలగాలు చేపడుతున్న అనేక ఆపరేషన్ల నుంచి అతను చాకచక్యంగా తప్పించుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదుల కదలికపై పక్కా సమాచారం అందుకున్న ఆర్మీ, పోలీస్, సీఆర్పీఎఫ్ సంయుక్త బలగాలు ఈ రోజు అనంతనాగ్ జిల్లాలోని మునివార్ద్ గ్రామాన్ని చుట్టుముట్టి గాలింపు ప్రారంభించాయి.
అక్కడే ఓ ఇంటిలో నక్కి ఉన్న ఉగ్రవాదులు బలగాల కదలికలను గుర్తించి విచక్షణారహితంగా కాల్పులు ప్రారంభించారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కాగా, ఎన్ కౌంటర్ నేపథ్యంలో ఈ ప్రాంతంలో వదంతులు వ్యాపించకుండా మొబైల్, ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. శ్రీనగర్-బనిహాల్ మార్గంలో రైలు సర్వీసులను కూడా ఆపేశారు.