పోలీసుల నిఘా వైఫల్యం... చంద్రబాబు బస్సును అడ్డుకున్న ఎస్ఎఫ్ఐ!
- కర్నూలులో ఘటన
- బస్సులో చంద్రబాబు ఉండగానే అడ్డుకున్న విద్యార్థులు
- ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వాలంటూ నినాదాలు
- 11 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు
చంద్రబాబు ప్రయాణిస్తున్న బస్సు ఆర్ఎస్ రహదారిలోని జంక్షన్ వద్దకు రాగానే, జలమండలి కార్యాలయం వద్ద అప్పటికే సిద్ధంగా ఉన్న ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు, పోలీసుల వలయాన్ని ఛేదించుకుని ముందుకు వచ్చి, బస్సును అడ్డుకున్నారు. తమకు ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్ మెంట్ ను ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. ఆ సమయంలో సీఎం బస్సులోనే ఉండటంతో, పోలీసులు వెంటనే రంగ ప్రవేశం చేసి, వారిని అడ్డు తొలగించారు.
ఈ క్రమంలో కొంత ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. 11 మంది విద్యార్థులను అరెస్ట్ చేసిన పోలీసులు, వారిపై కేసు నమోదు చేశారు. విద్యార్థులు ఇలా దూసుకు రావడం వెనుక పోలీసుల నిఘా వైఫల్యమే కారణమన్న విమర్శలు వస్తున్నాయి.