Hyderabad: గతంలో వధువు తీసుకున్న ఓ సెల్ఫీ... పెళ్లిని అడ్డుకుంది!

  • గతంలో హైదరాబాద్ లో పనిచేసిన యువతి
  • ఆ సమయంలో మరో ఉద్యోగితో సెల్ఫీ
  • వాటిని వరుడికి పంపి పెళ్లిని ఆపివేయించిన ప్రబుద్ధుడు

గతంలో తన స్నేహితుడితో కలసి తీసుకున్న ఓ సెల్ఫీ పెళ్లిని ఆపిన ఘటన కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో జరిగింది. ఈ ఘటనలో రెండు కేసులను నమోదు చేసిన పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, వరంగల్‌ జిల్లా సూరారం గ్రామానికి చెందిన ఓ యువతి (23) హైదరాబాద్‌ లోని ఓ సూపర్‌ మార్కెట్‌ లో పనిచేస్తున్న వేళ, అక్కడే క్యాషియర్‌ గా పనిచేస్తున్న మల్లబోయిన ప్రశాంత్‌ అనే యువకుడితో సెల్ఫీలు దిగింది.

ఆపై యువతికి మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్‌ కు చెందిన ఆడెపు అనిల్‌ కుమార్‌ తో వివాహం నిశ్చయం కాగా, ఆదివారం పెళ్లికి ముహూర్తం నిర్ణయించారు. హుజురాబాద్‌ లోని బీఎస్ఆర్‌ గార్డెన్స్ లో వీరి పెళ్లి ఘనంగా చేసేందుకు ఏర్పాట్లు జరిగిపోయాయి. కాసేపట్లో వరుడు తాళి కడతాడనగా, అతని ఫోన్‌ కు ప్రశాంత్‌, వధువు కలిసున్న సెల్ఫీ ఫొటోలు వచ్చాయి. ఆపై వరుడికి ఫోన్‌ చేసిన ప్రశాంత్, తామిద్దరం చాలా కాలంగా ప్రేమించుకుంటున్నామని చెప్పాడు

దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన అనిల్ కుమార్, తనను దారుణంగా మోసం చేశారని ఆరోపిస్తూ, ఆమెను పెళ్లి చేసుకునేందుకు నిరాకరించాడు. వధువుపై, ఆమె కుటుంబ సభ్యులపై ఇదే విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరోవైపు వధువు కూడా ప్రశాంత్‌ పై ఫిర్యాదు చేస్తూ, ఎప్పుడో తీసుకున్న సెల్ఫీలను అడ్డుపెట్టుకుని తన పెళ్లి ఆగిపోయేలా చూశాడని, అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. రెండు కేసులనూ నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు.

More Telugu News