కడప స్టీల్‌ ప్లాంట్‌ విషయంలో మోసం చేస్తున్నారు: కేంద్ర ప్రకటనపై ఢిల్లీలో గల్లా జయదేవ్‌

కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమపై నిన్న సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్‌ సమర్పించిందని, అందులో సెయిల్‌ నివేదికను ప్రస్తావించారని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ అన్నారు. అది కడప జిల్లాలో స్టీల్‌ ప్లాంట్‌ సాధ్యం కాదంటూ 2014 డిసెంబరులో సెయిల్‌ ఇచ్చిన నివేదిక అని అన్నారు. ఈరోజు ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...  2014కు, ఇప్పటికీ స్టీల్‌ ధరల్లో చాలా మార్పులు వచ్చాయని, స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంటే పాత విషయాలనే ఎందుకు ప్రస్తావించాలని ప్రశ్నించారు.

మళ్లీ ఈరోజు ఉక్కు పరిశ్రమపై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని ఉక్కు మంత్రిత్వ శాఖ ప్రకటన చేసిందని గల్లా జయదేవ్‌ అన్నారు. సుప్రీంకోర్టులో అలా చెబుతూ మరోవైపు ఇలాంటి ప్రకటనలు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. 


More Telugu News