యోగి ఆదిత్యనాథ్ ను నిందిస్తూ... కీలక నిర్ణయం తీసుకున్న రాందేవ్ బాబా!
- మరో రాష్ట్రానికి మెగా ఫుడ్ పార్క్
- అధికారులు సహకరించడం లేదన్న ఆచార్య బాలకృష్ణ
- ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేదని విమర్శలు
"ఈ ప్రాజెక్టుకు యోగి సర్కారు నుంచి ఏ మాత్రం సహకారం అందలేదు. మేము అనుమతుల కోసం చానాళ్లుగా ఎదురుచూసి విసిగిపోయాం. ఇప్పుడిక ప్రాజెక్టును మరో రాష్ట్రానికి తరలించాలని నిర్ణయించాం" అని ఆయన అన్నారు. ప్రాజెక్టుకు అనుమతుల విషయమై పలుమార్లు ముఖ్యమంత్రి నుంచి ప్రభుత్వ అధికారుల వరకూ ఎన్నోసార్లు సమావేశం అయ్యామని, ఏ మాత్రం ప్రయోజనం లేకపోయిందని అన్నారు. ఇప్పటికే ఫుడ్ ప్రాసెసింగ్ మెషీనరీ కోసం ఆర్డర్లు ఇచ్చామని, ఈ ప్రాజెక్టు యూపీలో వచ్చుంటే, రైతులకు లాభదాయకంగా ఉండేదని, భారీ ఎత్తున నిరుద్యోగులకు ఉపాధి లభించేదని చెప్పిన బాలకృష్ణ, ఈ నిర్ణయం రాందేవ్ స్వయంగా తీసుకున్నారని చెప్పారు.
ఇదిలావుండగా, పతంజలి ఆయుర్వేద తలపెట్టిన మెగా ఫుడ్ పార్క్ విషయమై కేంద్రం వాదన మరోలా ఉంది. ఈ ప్రాజెక్టుకు ఢిల్లీ సమీపంలోని నోయిడా పరిధిలో ఉన్న గౌతమ్ బుద్ధ నగర్ లో ఏర్పాటు చేసేందుకు గత జనవరిలో కేంద్రం ప్రాధమిక అనుమతులు మంజూరు చేసింది. అయితే, బ్యాంక్ లోన్ రుణాలు, భూ సేకరణ తదితరాల్లో కొన్ని నిబంధనలను సంస్థ పాటించాల్సి వుండగా, ఆ విషయంలో విఫలమైంది. గడువు ముగిసిన తరువాత కూడా తాము పతంజలి ఆయుర్వేదకు నెల రోజుల సమయం ఇచ్చామని, నిబంధనలను పాటించకుంటే, ప్రాజెక్టును రద్దు చేయడం తప్ప మరో మార్గం లేదని ఫుడ్ ప్రాసెసింట్ డిపార్ట్ మెంట్ హెడ్ జేపీ మీనా వ్యాఖ్యానించడం గమనార్హం.