'అజ్ఞాతవాసి' అట్టర్ ఫ్లాప్ కావడంతో పవన్ కు మతి భ్రమించింది: ఎమ్మెల్యే పార్థసారథి
టీడీపీ నేతపై జనసేన అధినేత తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో, ఆయనపై తెలుగుదేశం పార్టీ నేతలు మండిపడుతున్నారు. బీజేపీ కుట్రలో భాగంగానే పవన్ కల్యాణ్ ఇలాంటి విమర్శలకు తెరతీశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పవన్ పై విమర్శలు గుప్పించారు. పెనుకొండ ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతూ, పవన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నో అంచనాలతో విడుదలైన 'అజ్ఞాతవాసి' సినిమా అట్టర్ ఫ్లాప్ కావడంతో... పవన్ కల్యాణ్ కు మతిభ్రమించిందని ఆయన అన్నారు. అసలు ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదని మండిపడ్డారు. ఏపీ ప్రజల అండ టీడీపీకి మాత్రమే ఉందని... పవన్ కల్యాణే కాదు ఎవరు వచ్చినా టీడీపీకి వచ్చిన ఇబ్బంది లేదని అన్నారు.