పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై నేనేమీ స్పందించను: కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి
- లోకేష్ ను టార్గెట్ చేసుకుని పవన్ విమర్శలు
- స్పందించేందుకు నిరాకరించిన సుజనా చౌదరి
- సరైన సమయంలో సరైన వ్యక్తులే మాట్లాడతారన్న సుజనా
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తెలుగుదేశం పార్టీని, మంత్రి లోకేష్ ను టార్గెట్ చేసుకుని చేసిన తీవ్ర విమర్శలపై స్పందించేందుకు కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి నిరాకరించారు. పవన్ వ్యాఖ్యలపై తానేమీ మాట్లాడబోనని ఆయన స్పష్టం చేశారు. సరైన సమయంలో సరైన వ్యక్తులే పవన్ ఆరోపణలను తిప్పికొడతారని చెప్పిన ఆయన, పార్లమెంట్ లో రాజీనామా చేసిన తరువాత కూడా తనకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదని ఆరోపించిన ఆయన, తన ప్రసంగ పాఠానికి కూడా సవరణలు చేస్తున్నారని అన్నారు. రాజీనామాలు చేస్తే, కేంద్రంలో ఎంతో కొంత మార్పు వస్తుందని ఆశించామని, కానీ ఆ పార్టీ ఎంతమాత్రమూ లెక్క చేయడం లేదని అన్నారు. సమస్యలను పరిష్కరించుకునేలా ఎటువంటి స్పందనా రావడం లేదని, మరోసారి తమ అధినేత చంద్రబాబుతో మాట్లాడి తదుపరి ఏం చేయాలన్న విషయాన్ని వెల్లడిస్తామని తెలిపారు.