bonjour india -2018: ఈ నెల 13న హైదరాబాద్ లో ఫ్రెంచ్ ఏరియల్ షో

ఈ నెల 13న పీపుల్స్ ప్లాజాలో ఫ్రెంచ్ ఏరియల్ షో నిర్వహిస్తున్నట్లు పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఆజ్మీరా చందూలాల్ తెలిపారు. తెలంగాణ సచివాలయంలో ఈరోజు ఆయన మాట్లాడుతూ, ఇండో - ఫ్రెంచ్ ప్రభుత్వాల ఒప్పందంలో భాగంగా ‘బోంజూర్ ఇండియా - 2018’ ఉత్సవాలను దేశ వ్యాప్తంగా 33 నగరాలలో నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ ఉత్సవాల్లో భాగంగా మొట్టమొదటి ప్రదర్శనకు వేదికగా హైదరాబాద్ ను ఎంచుకోవడం ఆనందదాయకమని అన్నారు. ఫ్రెంచ్ ఇనిస్టిట్యూట్  ఫ్రాన్సిస్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో 18 మంది కళాకారులతో దేశంలోనే మొదటిసారిగా పెద్ద ఎత్తున సాంస్కృతిక ప్రదర్శనలను నిర్వహిస్తున్నారని అన్నారు.అనంతరం, పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం మాట్లాడుతూ, ఈ ప్రదర్శనలో సంగీతం, నృత్యం, సర్కస్, క్రాఫ్ట్, ఆర్కెష్ట్రా ఉంటాయని అన్నారు. ఫ్రెంచ్ ప్రభుత్వ నిధులతో దాదాపు కోటి రూపాయల ఖర్చుతో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనను విజయవంతం చేయాలని, ఎటువంటి ప్రవేశ రుసుము లేనందున నగర వాసులు పెద్దఎత్తున పాల్లొని జయప్రదం చేయాలని కోరారు. ఇండో - ఫ్రెంచ్ ప్రభుత్వాల మధ్య సన్నిహిత సంబంధాలలో భాగంగా ఇలాంటి కార్యక్రమాలు హైదరాబాద్ లో నిర్వహించడాన్ని ప్రభుత్వ సలహాదారు పాపారావు ప్రశంసించారు. ఈ  కార్యక్రమంలో ఫ్రెంచ్ ఇన్ స్టిట్యూట్ ఫ్రాన్సిస్ డైరెక్టర్ ఎమిలిన్ పాల్గొన్నారు.
bonjour india -2018
Hyderabad

More Telugu News