మలయాళ నటి సనూష ధైర్యానికి కేరళ పోలీసుల సత్కారం!

రైల్లో తనకు ఎదురైన లైంగిక వేధింపులను సమర్థవంతంగా ఎదుర్కొన్న మలయాళ నటి సనూషను కేరళ పోలీసులు ఘనంగా సత్కరించారు. మవేలీ ఎక్స్ ప్రెస్ లో ఏసీ ఏ-1 కోచ్ లో ఆమె ప్రయాణిస్తున్న వేళ, మరో ప్రయాణికుడు బోస్, ఆమెతో అసభ్యంగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని చుట్టుపక్కల ప్రయాణికులకు చెప్పినా, వారు మౌనంగా ఉండిపోవడంతో, తన తండ్రిని సలహా అడిగిన సనూష, ఆయన ఇచ్చిన ధైర్యంతో రెచ్చిపోయారు. అతడిని ధైర్యంగా ఎదిరించి, త్రిస్సూర్ పోలీసులకు అప్పగించారు.

ఇక సనూష చూపిన ధైర్యాన్ని ప్రశంసించిన పోలీసులు, ఆమెను, ఆమె కుటుంబ సభ్యులను డీజీపీ ఆఫీసుకు ఆహ్వానించి సన్మానించారు. కాగా, తనకు ఎదురైన అనుభవాన్ని మీడియాకు వెల్లడించిన సనూష, ఆపదలో ఉన్న మహిళపట్ల సమాజం అండగా నిలవలేదని ఆరోపించింది. రైల్లో తనకు ఎవరూ సాయం చేసేందుకు రాలేదని, దీంతో ఈ సమాజంపై తనకు నమ్మకం పోయిందని సంచలన వ్యాఖ్యలు చేసింది.


More Telugu News