మంత్రి కేటీఆర్ కు దక్కిన మరో అరుదైన గౌరవం.. దావోస్ సదస్సుకు ఆహ్వానం

తెలంగాణ మంత్రి కేటీఆర్ కు మరో అరుదైన గౌరవం దక్కింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ దావోస్ లో నిర్వహించనున్న వార్షిక సదస్సుకు హాజరుకావాలంటూ ఆయనకు ప్రత్యేక ఆహ్వానం అందింది. వచ్చే నెలలో స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరగనున్న ఈ వార్షిక సదస్సులో ఆయన పాల్గొననున్నట్టు ఓ ప్రకటనలో తెలిపారు. జనవరి 17, 18 తేదీల్లో రెండు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో ప్రపంచ దేశాల నుంచి రానున్న పలు కంపెనీల సీఈఓలు, చైర్మన్లతో కేటీఆర్ సమావేశం కానున్నారు. ఈ ఆహ్వానంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.

 తెలంగాణ ప్రభుత్వ పాలసీలను, పారిశ్రామిక విధానాన్ని, పెట్టుబడుల అవకాశాలను ప్రపంచం ముందు ఉంచుతానని పేర్కొన్నారు. కాగా, సాధారణంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సదస్సుకు కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మాత్రమే ఆహ్వానం అందుతుంది. కానీ, ఓ రాష్ట్ర మంత్రికి వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ నుంచి ఆహ్వానం లభించడం ఇదే తొలిసారి. మంత్రి కేటీఆర్ తోపాటు ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ రెసిడెంట్ కమిషనర్ అరవింద్ కుమార్, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ ఈ సదస్సులో పాల్గొననున్నారు.   


More Telugu News