విశాఖ ఘటన విన్నాక నేను చాలా డిస్టర్బ్ అయ్యా: పవన్ కల్యాణ్

  • దళిత మహిళపై దాడి గురించి పవన్ స్పందన
  • వెంటనే చర్యలు చేపట్టాలంటూ సూచన
  • ప్రతి విషయానికి కులం రంగు పులమొద్దు
విశాఖపట్టణం పెందుర్తిలో ఓ దళిత మహిళను అందరూ చూస్తుండగా చీరను చింపి అవమానించిన ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ ఘటనకు సంబంధించి ఏపీ ప్రభుత్వం నుంచి ప్రజలు వివరణ కోరుతున్నారని ట్విట్టర్ ద్వారా అన్నారు. టీడీపీ నేతలే ఈ దారుణానికి ఒడిగట్టారని రిపోర్టులు చెబుతున్నాయని అన్నారు. ఈ ఘటన గురించి విన్న తర్వాత తాను చాలా డిస్టర్బ్ అయ్యానని తెలిపారు. ఈ దారుణానికి ఒడిగట్టిన నేరస్తులపై పోలీసులు, ప్రభుత్వం ఇంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని... దీనివల్ల ప్రజల్లోకి చెడు సంకేతాలు వెళతాయని అన్నారు. కారంచేడు, చుండూరు ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని చెప్పారు.

చాలా సున్నితమైన ఇలాంటి అంశాలపై స్పందించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని... లేకపోతే సామరస్యం దెబ్బతింటుందని పవన్ అన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే పరిస్థితులు దిగజారుతాయని అన్నారు. రోహిత్ వేముల మరణం దేశవ్యాప్తంగా ఎంతటి ఉద్రిక్తతను రేకెత్తించిందో ఆలోచించుకోవాలని... అధికారులు మౌనాన్ని వీడాలని సూచించారు. ఈ విషయంలోకి తాను వ్యక్తిగతంగా తలదూర్చి, మాట్లాడితే అధికారులపై విపరీతమైన ఒత్తిడి నెలకొంటుందని అన్నారు. మహిళల గౌరవాన్ని కాపాడాలని, వారికి న్యాయం జరిగేలా చూడాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నానని చెప్పారు. వ్యక్తిగతంగా కొందరు చేసే పనులకు కులం రంగు పులుముతున్నారని... ఇది మంచి పద్ధతి కాదని అన్నారు.
Go Back to Shorts
Pawan Kalyan
dalit lady

More Telugu News