వెంకయ్యనాయుడి: ఇకపై ‘ఐ బెగ్ యూ’ వాడొద్దు.. రాజ్యసభలో వెంకయ్యనాయుడి మార్కు!

  • మనకు స్వాతంత్ర్యం రాక మునుపు ‘ఐ బెగ్ యూ’ అనే వారు
  • దాని బదులు ‘ఐ రెయిజ్ టు లే ఆన్ ది టేబుల్’ అని చెప్పండి
  • సభ్యులకు సలహా ఇచ్చిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

ఏ అంశం గురించి అయినా అవలీలగా మాట్లాడటం, ప్రాసతో తనదైన శైలిలో ఆకట్టుకోవడం, నాడు కేంద్ర మంత్రిగా, బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా తన దైన పనితీరును కనిపించిన వ్యక్తి వెంకయ్యనాయుడు. ఉపరాష్ట్రపతి గానూ వెంకయ్యనాయుడు తన దైన ‘మార్క్’ వేశారని చెప్పడానికి రాజ్యసభలో ఈరోజు జరిగిన సంఘటనే నిదర్శనం. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈరోజు నుంచి ప్రారంభమైన నేపథ్యంలో రాజ్యసభలోకి చైర్మన్ గా వెంకయ్యనాయుడు రాగానే సభ్యులందరూ అభివాదం చేశారు.

అనంతరం, వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ఓ సలహా చేస్తున్నట్టు చెప్పారు. ఇంతకీ, ఆ సూచన ఏంటంటే.. సాధారణంగా చట్టసభల్లో సభ్యులు ఏదైనా చెప్పేటప్పుడు తమ చేతుల్లో ఉన్న పత్రాలను టేబుల్ పై పెడుతూ ‘ఐ బెగ్ యూ’ అనే పదంతో రాజ్యసభ చైర్మన్ కు విజ్ఞప్తి చేస్తారు. అయితే, ఈ వాక్యాన్ని మనకు స్వాతంత్ర్యం రాక మునుపు వాడేవారని, ఇప్పుడు.. మనది స్వతంత్ర భారతదేశం కనుక ఆ అవసరం లేదని, ఇకపై, ‘ఐ రెయిజ్ టు లే ఆన్ ది టేబుల్’ అనే వాక్యాన్ని ఉపయోగించాలని వెంకయ్యనాయుడు సూచించారు.

అయితే, ఇది తన సలహా మాత్రమేనని, ఆదేశం కాదని ఆయన అన్నారు. కాగా, ఐ బెగ్ యూ అంటే ‘నేను వేడుకుంటున్నా’ అని, ‘ఐ రెయిజ్ టు లే ఆన్ ది టేబుల్’ అంటే  ‘నేను లేవనెత్తుతున్నాను’ అని అర్థం.

More Telugu News