: అమరావతికి ‘పర్యావరణ’ ముప్పు?...శర్మ పిటిషన్ పై ఏప్రిల్ 4న ఎన్జీటీ విచారణ

నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతికి మరోమారు ‘పర్యావరణ’ ముప్పు పొంచి ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. గుంటూరు జిల్లాలో కృష్ణా నది ఒడ్డున తుళ్లూరు పరిసర ప్రాంతాల్లోని భూములను రాజధానికి ఎంపిక చేసిన చంద్రబాబు ప్రభుత్వం అక్కడ అమరావతి పేరిట రాజధానిని కడుతోంది. ప్రస్తుతం అక్కడ తాత్కాలిక రాజధాని పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ క్రమంలో తుళ్లూరులో కడుతున్న రాజధాని అమరావతికి ‘ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎన్విరాన్ మెంట్ ఇంపాక్ట్ అసెస్ మెంట్ అథారిటి’ ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని సామాజికవేత్త, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన ట్రైబ్యునల్ వచ్చే నెల (ఏప్రిల్) 4న విచారించనున్నట్లు కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం, సీఆర్డీఏ, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎన్విరాన్ మెంట్ ఇంపాక్ట్ అసెస్ మెంట్ అథారిటీ, ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులను శర్మ ప్రతివాదులుగా పేర్కొన్నారు. సిరులు పండే భూముల్లో రాజధాని ఎలా కడతారని ప్రశ్నిస్తున్న శర్మ, రాజధానిని 23 గ్రామాల పరిధిలో ఏర్పాటు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే.

More Telugu News