చాయ్ షాట్స్ ద్వారా ‘ఋతురాగాలు’ లాంటి కల్ట్ సీరియల్స్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం!

డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్‌లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన చాయ్ బిస్కెట్ ఇటీవలే లాంచ్ చేసిన షార్ట్ సిరీస్ ఓటీటీ ప్లాట్‌ఫారం ‘చాయ్ షాట్స్’ సూపర్ సక్సెస్ సాధించింది. స్మార్ట్‌ఫోన్ ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ‘చాయ్ షాట్స్’ కంటెంట్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేస్తూ కొత్త సీరియల్స్‌తో పాటు తెలుగు ఐకానిక్ సీరియల్స్‌ను కూడా చాయ్ షాట్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ఈ విశేషాలను వెల్లడిస్తూ ‘చాయ్ షాట్స్ కిట్టీ పార్టీ’ ప్రెస్ మీట్ నిర్వహించారు.

ప్రెస్ మీట్ లో చాయ్ షాట్స్ కో-ఫౌండర్ శరత్ చంద్ర మాట్లాడుతూ…“అందరికీ నమస్కారం. డిసెంబర్‌లో చాయ్ షాట్స్ లాంచ్ ఈవెంట్ నిర్వహించాం. అప్పటికి యాప్‌ను ఎలా డిజైన్ చేయాలి, ఎలాంటి కంటెంట్ ఇవ్వాలని ఆలోచనల్లో ఉన్నాం. ఇప్పుడు మూడు నెలలు గడిచాయి. ఈ సమయంలో మేము గుర్తించిన విషయం ఏమిటంటే..మా ఆడియన్స్‌లో దాదాపు 70%  35 ఏళ్లు పైబడినవారు. చాయ్ బిస్కెట్‌ లో మేము యంగ్ ఆడియన్స్ కోసం కంటెంట్ చేయడం అలవాటు. చాయ్ షాట్స్ లో టీవీ సీరియల్స్ తరహా కంటెంట్ చేసినప్పుడు అద్భుతమైన స్పందన వచ్చింది. అందుకే రమణి గారిని సంప్రదించి దీన్ని ఇంకా పెద్ద స్థాయిలో ఎలా తీసుకెళ్లాలి అని చర్చించాం. 

ప్రస్తుతం టీవీకి పని చేస్తున్న యాక్టర్స్, డైరెక్టర్స్‌తో కలిసి దాదాపు డజన్ షార్ట్ సీరియల్స్ రూపొందించాం. ఇవన్నీ యాప్‌లో అందుబాటులో ఉన్నాయి. ప్రతి ఎపిసోడ్ రెండు నిమిషాలు  ఉంటుంది. ఒక సీజన్‌లో దాదాపు 30 ఎపిసోడ్లు ఉంటాయి. ఇప్పటివరకు 15కి పైగా షార్ట్ సీరియల్స్ ఉన్నాయి, ఇంకా కొత్తవి వస్తున్నాయి. డివోషనల్ షోస్ కూడా ప్రారంభించాం. ‘ఋతురాగాలు’ వంటి కల్ట్ సీరియల్స్‌తో పాటు మరికొన్ని లెజెండరీ తెలుగు షోస్‌ను చాయ్ షాట్స్‌లో తీసుకురాబోతున్నాం. చాయ్ షాట్స్ ను టీవీ, ఓటీటీ కలిపి ఒక ప్యాకేజ్‌గా చేయాలని అనుకుంటున్నాం. చిన్నప్పుడు చూసిన ‘పట్టుకుంటే పట్టు చీర’ లాంటి షోను మళ్లీ రిక్రియేట్ చేశాం.  హరితేజ గారితో ఆ షోను రూపొందిస్తున్నాం. ప్రతి రోజు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారం అవుతుంది. ఇప్పుడు ‘టీవీ ఎవరు చూస్తున్నారు?’ అనే అభిప్రాయం ఉంది. కానీ టీవీలో ఉన్న భావోద్వేగాలు, డ్రామా..  ఇవన్నీ యాప్‌లోకి తీసుకురావడం మా లక్ష్యం.”

అనురాగ్ రెడ్డి మాట్లాడుతూ…“కరోనా సమయంలో ఆఫీస్‌కు ఎవరు రాకపోవడంతో ఒక నిమిషం నిడివి గల వీడియోలు చేయడం ప్రారంభించాం. అవే మైక్రో డ్రామాలుగా మారాయి. చైనీస్, కొరియన్ కంటెంట్‌ను డబ్బింగ్ చేసి ఇండియా యూజర్స్‌కు అందిస్తున్నారు. కానీ మన దగ్గర అద్భుతమైన కంటెంట్ వుంది. ‘ఋతురాగాలు’ వంటి కల్ట్ తెలుగు సీరియల్స్‌ను మళ్లీ ప్రేక్షకులకు అందించబోతున్నాం.  మన సంస్కృతిని ప్రతిబింబించే కంటెంట్‌ను ముందుకు తీసుకెళ్లాలి అనేది మా లక్ష్యం. ‘ఓల్డ్ ఈజ్ గోల్డ్’..పాత కథలు కొత్త రూపంలో ప్రేక్షకులను మళ్లీ అలరిస్తాయి. భావోద్వేగాలు ఎప్పుడూ మారవు, వాటి రూపమే మారుతుంది.

రచయిత్రి బలభద్రపాత్రుని రమణి మాట్లాడుతూ… శరత్ చాయ్ బిస్కెట్‌తో చాలా సక్సెస్ సాధించాడు. చాయ్ షాట్స్ తో ఇంకా ఎక్కువ సక్సెస్ కావాలని ఆశిస్తున్నాను. క్రియేటివ్ డైరెక్టర్‌గా పనిచేయడానికి మా టీమ్ ఎంతో సహకరించింది. నటీనటులు, డైరెక్టర్స్, టెక్నికల్ టీమ్ అందరూ అద్భుతంగా పని చేస్తున్నారు. చాయ్ షాట్స్‌లో మంచి కంటెంట్ ఉంది. మంచి సీరియల్స్‌ను షార్ట్ ఫార్మాట్‌లో అందించాలనే ఉద్దేశంతో వచ్చాం. సీనియర్ సిటిజన్స్‌కు కూడా సరిపోయే కంటెంట్, డివోషనల్ ప్రోగ్రామ్స్ అందిస్తున్నాం. మంచి కథలు, మంచి ఆర్టిస్టులతో నాణ్యమైన కంటెంట్ అందిస్తున్నాం.  

నటి సుహాసిని మాట్లాడుతూ…“రమణి గారు చాయ్ షాట్స్ గురించి చెప్పినప్పుడే  చాలా ఎక్సైట్  అయ్యాను. సాధారణంగా రెండు మూడు సంవత్సరాలు పట్టే సిరీస్‌ను ఒక గంటలో పూర్తి చేయడం చాలా కొత్త అనుభవం. నేను ఇందులో ప్రొడ్యూసర్‌గా కూడా ఉన్నాను. యాక్టింగ్ కూడా కొత్తగా అనిపించింది. కథలు చాలా బాగున్నాయి. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ చూడదగ్గ కంటెంట్ ఇందులో ఉంది

ప్రొడ్యూసర్ నాగబాబు మాట్లాడుతూ… ఈ అవకాశం ఇచ్చిన రమణి గారికి ధన్యవాదాలు. ఇందులో పని చేయడం చాలా ఆనందంగా ఉంది. నేను బాబా భక్తుడిని. డివోషనల్ కంటెంట్ చేయడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది

ప్రొడ్యూసర్ భారతి కృష్ణ మాట్లాడుతూ… అందరికీ నమస్కారం. రమణి గారు షార్ట్ సీరియల్స్ చేయమని పిలిచినప్పుడు మొదట కొంచెం సందేహించాం. కానీ పని చేయడం మొదలుపెట్టిన తర్వాత చాలా ఎక్సైట్ అయ్యాం. శరత్, అనురాగ్ గారి విజన్‌కు హ్యాట్సాఫ్ చెప్పాలి. ఇప్పుడు డివోషనల్ కంటెంట్ కూడా ప్రారంభించడం మంచి విషయం. ఈ రోజుల్లో యువత కూడా డివోషనల్ కంటెంట్ ఇష్టపడుతున్నారు. ఈ ట్రెండ్ భవిష్యత్తులో ఇంకా పెరుగుతుంది.



More Press Releases