కదిరి నృసింహ క్షేత్రంలో ‘శ్రీమాలిక’ వైభవం: భక్తులకు దివ్య గ్రంథాల ప్రసాదం!

అనంతపురం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కదిరిలో వెలసిన శ్రీ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతున్నాయి. ఈ పవిత్ర సందర్భాన్ని పురస్కరించుకుని ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ రూపొందించిన ‘శ్రీమాలిక’ అనే అఖండ ఆధ్యాత్మిక గ్రంథాన్ని భక్తులకు అందజేయడం విశేషం. సుమారు 400 పేజీలతో, మంత్ర స్తోత్ర కథా వైభవాలతో కూడిన ఈ పుస్తకాన్ని దేవస్థానం డిప్యూటీ కమిషనర్ వెండిదండి శ్రీనివాసరెడ్డి శుక్రవారం ఆవిష్కరించారు.

ఆధ్యాత్మిక వారధిగా శ్రీమాలిక..
ఈ గ్రంథం కేవలం పుస్తకం మాత్రమే కాదని, నృసింహ స్వామి ఆవిర్భావ ఘట్టం నుంచి తిరుమల వైభవం వరకు అనేక అంశాలను అద్భుతంగా వివరించిన జ్ఞాన నిధి అని ఆలయ వర్గాలు పేర్కొన్నాయి. మాజీ మంత్రి, కిమ్స్ హాస్పిటల్స్ వ్యవస్థాపక చైర్మన్ బొల్లినేని కృష్ణయ్య ఈ గ్రంథాలను వందల సంఖ్యలో ఆలయానికి సమర్పించారు. వీటిని బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు, పండితులకు ఉచితంగా పంపిణీ చేయనున్నారు.

    బాలయ్య, సాయి కొర్రపాటిల ప్రోత్సాహం..
ఈ దివ్య సంకల్పం వెనుక హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటిల ప్రోత్సాహం ఎంతో ఉందని ఈవో శ్రీనివాసరెడ్డి కొనియాడారు. గతంలో కూడా బాలయ్య సహకారంతో ‘శరణు.. శరణు’ వంటి విశిష్ట గ్రంథాలను కదిరి, సింహాచలం వంటి క్షేత్రాల్లో భక్తులకు అందజేశారు. దశాబ్దాలుగా పురాణపండ శ్రీనివాస్ తన రచనల ద్వారా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన క్షేత్రాలలో ధర్మ ప్రచారానికి కృషి చేస్తున్నారని ఆయన అభినందించారు.

కొనసాగుతున్న ఉత్సవాలు..
ప్రస్తుతం కదిరి క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ప్రతిరోజూ వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈ క్రమంలో భక్తులకు ఆధ్యాత్మిక పుస్తకాలను ప్రసాదంగా అందించడం వల్ల వారికి క్షేత్ర విశేషాలు, స్తోత్రాల పట్ల అవగాహన పెరుగుతుందని భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
     

More Press Releases