మత్స్య శాఖ అధికారులతో మంత్రి తలసాని సమావేశం

Related image

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పరిధిలోని అంతర్ రాష్ట్ర జలాశయాలాలలో చేపల వేట నిర్వహించే అర్హత కలిగిన మత్స్యకారులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్  తెలిపారు. గురువారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో మత్స్య శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్ర, మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యా, గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల మత్స్య శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతి ఏటా ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో భాగంగా కృష్ణానది పై ఉన్న శ్రీశైలం ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్, నాగార్జున సాగర్ రిజర్వాయర్, పులిచింతల ప్రాజెక్ట్, నాగర్ కర్నూల్ జిల్లా పరిధిలోని సోమశిల, మరియు తుంగభద్ర నది పై ఉన్న సుంకేశుల ప్రాజెక్ట్ తదితర ప్రాజెక్టుల లో కోట్లాది చేప పిల్లలను విడుదల చేస్తున్నట్లు వివరించారు.

ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం ఉచిత చేప పిల్లల పంపిణీ కోసం 7.12 కోట్ల రూపాయలను ఖర్చు చేసిందని వివరించారు. పెరిగిన చేపలను పట్టు కునేందుకు లైసెన్స్ పొందిన సుమారు 5,800 వేల మంది వరకు మత్సకారులు ఉన్నారని, వారికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. అంతర్ రాష్ట్ర ప్రాజెక్టు లలో చేపల వేట ను కొనసాగించే మత్స్యకారులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి వారి అవసరాలు, సమస్యలు తెలుసుకోవాలని ఆయా జిల్లాల మత్స్య శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు.

మత్స్యకారులకు అవసరమైన వలలు, మోపెడ్ లు, పవర్ బోట్ లను అందించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని, వారం రోజులలోగా మత్స్యకారుల అవసరాలను తెలుసుకొని ఒక సమగ్ర నివేదికను అందజేయాలని ఆదేశించారు. తెలంగాణ మత్స్యకారుల పై తరచుగా దాడులు జరుగుతున్నాయనే పిర్యాదులు వస్తున్నాయని, అలాంటి సంఘటనలను ప్రభుత్వం ఉపేక్షించ బోదని, దాడులకు పాల్పడే వారి పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని మంత్రి హెచ్చరించారు.

More Press Releases