మలయాళంలో డార్క్ కామెడీ నేపథ్యంలో గతంలో 'భరతనాట్యం' అనే సినిమా వచ్చింది. ఆ సినిమాకి సీక్వెల్ గా రూపొందినదే 'భరతనాట్యం 2: మోహినీ యాట్టం'. కృష్ణదాస్ మురళి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సైజూ కురుప్ .. సూరజ్ వెంజరమూడు ప్రధానమైన పాత్రలను పోషించారు. ఏప్రిల్ 10వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, 40 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అలాంటి ఈ సినిమా, ఈ నెల 8వ తేదీ నుంచి 'నెట్ ఫ్లిక్స్'లో తెలుగులోను స్ట్రీమింగ్ అవుతోంది.

భరతన్ నాయర్ చనిపోవడంతో, పెద్ద కొడుకైన శశిధరన్ (సైజూ కురుప్)పై కుటుంబ బాధ్యత పడుతుంది. తన తండ్రికి మరో ఫ్యామిలీ ఉందని తెలుసుకున్న శశిధరన్, ఆ కుటుంబాన్ని కూడా సెటిల్ చేయవలసిన బాధ్యత తనపై ఉందని భావిస్తాడు. తన పిన్ని అయిన రుక్మిణికీ .. ఆమె కొడుక్కి వాళ్ల ఊరులోనే కొత్తగా ఒక ఇల్లు కట్టించి ఇస్తాడు. వాళ్లను ఆ కొత్త ఇంట్లో దిగబెడతాడు. ఆ సమయంలోనే, ఆ విలేజ్ కి చెందిన గోవిందరాజన్ (సూరజ్ వెంజరమూడు) వచ్చి వాళ్లను కలుస్తాడు. 

గోవింద రాజన్ ఆ ఊరులోని మోహినేశ్వరి ఆలయాన్ని గురించి ప్రస్తావిస్తాడు. భరతన్ .. తాను .. బేబీ కలిసి ఆ ఆలయాన్ని నిర్మించామనీ, ఆ నకిలీ టెంపుల్ ద్వారా ఆస్తులు సంపాదించామని చెబుతాడు. అయితే ఇప్పుడు ఆ నిజం బయటపడే ప్రమాదం పొంచి ఉందనీ, అందువలన భరతన్ పై ఆ నేరాన్ని తోసేయాలని నిర్ణయించుకున్నామని అంటాడు. చనిపోయిన భరతన్ కి చెడ్డ పేరు తీసుకురావొద్దని వాళ్లంతా కోరతారు. అయితే 75 లక్షలు ఇస్తే, ఈ కేసు పరిష్కారమవుతుందని చెబుతాడు. శశిధరన్ వాళ్లంతా కూడా అంత డబ్బు ఎక్కడి నుంచి సర్దుబాటు చేయాలా అనే ఆలోచనలో పడతారు.

 అయితే వాళ్ల ఇబ్బందిని అర్థం చేసుకోకుండా గోవిందరాజన్ టార్చర్ చేయడం మొదలుపెడతాడు. ఒకానొక సందర్భంలో శశిధరన్ కుటుంబ సభ్యుల చేతిలో అతను చనిపోతాడు. గోవిందరాజన్ మేనల్లుడికి తెలియకుండా అతని శవాన్ని మాయం చేయడానికి వాళ్లు ఎలాంటి ప్రయత్నాలు చేస్తారు? ఎలాంటి పరిస్థితులను ఎదుర్కుంటారు? అనేది కథ.

అనుకోకుండా ఒక హత్య చేసిన శశిధరన్ కుటుంబ సభ్యులు, ఎవరికీ తెలియకుండా ఆ శవాన్ని అక్కడి నుంచి మాయం చేయాలని నిర్ణయించుకుంటారు. అందుకోసం వాళ్లు పడేపాట్ల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. పిన్ని కుటుంబాన్ని ఆదుకోవడానికి గాను ఆమె ఊరుకు తన కుటుంబంతో వెళ్లిన కథానాయకుడు అక్కడ ఎలా చిక్కుబడ్డాడు అనే అంశమే ఈ కథంలో ప్రధానమైనదిగా కనిపిస్తుంది. 

ఒక విలేజ్ .. ఒక కుటుంబం .. వాళ్లకి ఎదురైన సమస్యకి కారణమైన మరికొన్ని పాత్రలతో దర్శకుడు ఈ కథను నడిపించాడు. పాత్రలన్నీ కూడా ఒక పరిధిలో సంచరిస్తూ ఉంటాయి. ప్రతి పాత్రను డిజైన్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది. ఆ పాత్రల స్వరూప స్వభావాల విషయంలో దర్శకుడు ఎంత క్లారిటీతో ఉన్నాడనే విషయం అర్థమవుతుంది. స్క్రిప్ట్ పెర్ఫెక్ట్ గా ఉండటంతో, కామెడీ టచ్ కరెక్ట్ గా వర్కౌట్ అయింది. ఒక వైపున గోవిందరాజన్ కోసం పోలీసులు వెదుకుతుంటే, మరొక వైపున అతను దాచిన డబ్బుకోసం భాగస్థులు వెతుకుతుంటారు. ఈ రెండు అంశాల చుట్టూ తిరిగే పాత్రల హడావిడి ఆడియన్స్ కి వినోదాన్ని పంచుతుంది. 

గోవిందరాజన్ శవాన్ని ఎలా వదిలించుకుంటారు? అతను దాచిన డబ్బు ఏమౌతుంది? అనేవి ఆడియన్స్ ఈ కథను చివరివరకూ ఫాలో అయ్యేలా చేస్తాయి.శశిధరన్ .. అతని తల్లి .. గోవిందరాజన్ .. అతని మేనల్లుడి పాత్రలు ప్రధానమైన బలంగా కనిపిస్తాయి.  గోవిందరాజన్ శవం విషయంలో తమని భయపెట్టాలనుకున్న అతని మేనల్లుడిని తమ వైపుకు తిప్పుకోవడానికి శశిధరన్ ఫ్యామిలీ ఆడిన డ్రామా ఈ సినిమాలో హైలైట్ గా నిలుస్తుంది. కథలోని ట్విస్టులు ఎప్పటికప్పుడు ఆడియన్స్ ను మరింత ఉత్సాహపరుస్తూ వెళ్లడం బాగుంది.

 కథ .. స్క్రీన్ ప్లే .. పాత్రలను డిజైన్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది. బబ్లూ ఫొటోగ్రఫీ .. కిలి నేపథ్య సంగీతం .. షఫీక్ ఎడిటింగ్ కంటెంట్ కి మరింత బలాన్ని ఇచ్చాయి. కథకి తగిన లొకేషన్స్ మరింతగా కనెక్ట్ చేస్తాయి. ఎక్కడా ఎలాంటి లూజ్ సన్నివేశాలు లేకుండా, మొదటి నుంచి చివరివరకూ వినోదాన్ని పంచే సినిమా ఇది.