Virat Kohli: సన్‌రైజర్స్‌పై మ్యాచ్‌లో రికార్డులు క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్

  • ఆర్సీబీ తరపున వేగవంతమైన అర్ధసెంచరీ నమోదు చేసిన మూడవ ఆటగాడిగా నిలిచిన పటీదార్
  • గత రాత్రి హైదరాబాద్‌పై 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన యువ ఆటగాడు
  • 10 కంటే ఎక్కువ ఐపీఎల్‌ ఎడిషన్లలో 400 ప్లస్ పరుగులు చేసిన తొలి ఆటగాడిగా నిలిచిన కోహ్లీ
Virat Kohli and Rajat Patidar creates records against Sunrisers Hyderabad

ఐపీఎల్ 2024లో ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో గురువారం రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గ్రాండ్ విక్టరీ సాధించింది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌ గెలుపులో విరాట్ కోహ్లీ, యువ బ్యాటర్ రజత్ పాటిదార్ కీలక పాత్ర పోషించారు. వీరిద్దరూ అర్ధసెంచరీలు బాది హైదరాబాద్‌కు 206 పరుగుల టార్గెట్ నిర్దేశించడంలో సాయపడ్డారు. ఈ క్రమంలో వీరిద్దరూ అరుదైన రికార్డులను సొంతం చేసుకున్నారు.

19 బంతుల్లోనే అర్ధసెంచరీ బాదిన రజత్ పటీదార్.. ఆర్సీబీ తరపున వేగవంతమైన హాఫ్ సెంచరీ నమోదు చేసిన మూడవ ఆటగాడిగా నిలిచాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున గత 11 ఏళ్లలో 20 లోపు బంతుల్లో అర్ధ శతకాన్ని పూర్తి చేసిన ఆటగాడు రజత్ పటీదారే కావడం గమనార్హం. ఐపీఎల్ 2013 ఎడిషన్‌లో పుణె వారియర్స్‌పై క్రిస్ గేల్ 17 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదాడు. ఆ తర్వాత బెంగళూరు ఆటగాళ్లలో ఎవరూ 20 లోపు బంతుల్లో అర్ధ సెంచరీ చేయలేదు. 

ఆర్సీబీకి వేగవంతమైన అర్ధశతకాలు
1. క్రిస్ గేల్ - 17 బంతులు (2013)
2. రాబిన్ ఉతప్ప - 19 బంతులు (2010)
3. రజత్ పాటిదార్ -19 బంతులు -(2024)
4. ఏబీ డివీలియర్స్ - 21 బంతులు (2012)
5. రజత్ పాటిదార్ - 21 బంతులు (2024)

మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 51 పరుగులు బాదడంతో ప్రస్తుత సీజన్‌లో కోహ్లీ పరుగులు 400 దాటాయి. ఈ మార్క్‌ చేరుకున్న తొలి ఆటగాడిగా నిలిచాడు. అంతేకాదు ఐపీఎల్ 10 వేర్వేరు ఎడిషన్లలో 400 కంటే ఎక్కువ పరుగులు చేసిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.

More Telugu News