Chandrababu: మోదీ పార్టీలోని ఎంపీని తాకే ధైర్యం ఎవరికైనా ఉంటుందా?: తంబళ్లపల్లెలో చంద్రబాబు

  • అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లెలో ప్రజాగళం సభ
  • హాజరైన చంద్రబాబు
  • ఈసారి కూడా నరేంద్ర మోదీనే ప్రధాని అని వెల్లడి
  • 400 ఎంపీ సీట్లతో ఎన్డీయే మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా
  • మంత్రి పెద్దిరెడ్డిపై నిప్పులు చెరిగిన టీడీపీ అధినేత 
Chandrababu speech in Tamballapalle

అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లెలో ప్రజాగళం సభకు టీడీపీ అధినేత చంద్రబాబు హాజరయ్యారు. ఈ మధ్యాహ్నం అమిత్ షా హాజరైన ధర్మవరం సభలో పాల్గొన్న చంద్రబాబు... ఆ సభ ముగిసిన అనంతరం తంబళ్లపల్లె చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, మొరుసు కాపు వర్గం జనాభా ఎక్కువని, అందుకే సామాజిక న్యాయం కోసం మొరుసు కాపు వర్గానికి చెందిన జయచంద్రారెడ్డికి టికెట్ ఇచ్చానని చంద్రబాబు వెల్లడించారు. 

ఈసారి కూడా నరేంద్ర మోదీనే ప్రధాని అవుతారని, 400 ఎంపీ సీట్లతో ముచ్చటగా మూడోసారి ప్రధాని పీఠం ఎక్కబోతున్నారని నమ్మకం వెలిబుచ్చారు. నరేంద్ర మోదీ పార్టీలోని ఎంపీని తాకే ధైర్యం ఎవరికైనా ఉంటుందా? తాకడానికి ఎవరైనా వస్తే మసైపోతారు అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. 

రాజంపేట లోక్ సభ స్థానంలో కూటమి అభ్యర్థిగా ఉన్న బీజేపీ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఒక అనుభవజ్ఞుడైన నాయకుడు అని కొనియాడారు. కిరణ్ కుమార్ అనుభవంతో పోల్చితే ఈ పాపాల పెద్దిరెడ్డి ఒక బచ్చా అని పేర్కొన్నారు. పదవుల కోసం కాళ్ల దగ్గర కూర్చున్న బచ్చా అని విమర్శించారు. 

"నడమంత్రపు సిరి వచ్చింది, కొవ్వెక్కింది, ఆంబోతు మాదిరిగా తయారయ్యాడు... ఆంబోతును ఇలాగే వదిలేస్తారా ఎవరైనా? మా ఊరికి నీళ్లు రావడంలేదని ఏడు నెలల గర్భిణీ అడిగింది. అడిగితే పాపమా... నిన్ను అడగడానికి వీల్లేదా... నువ్వేమైనా దేవుడి బిడ్డవా? దీన్ని బట్టి నువ్వొక అరాచక శక్తివని నిరూపించుకున్నావ్. ఎమ్మెల్యే భార్య సాక్షిగా వైసీపీ గూండాలు ఆ అమ్మాయిపై దాడి చేస్తే, మన జయచంద్రారెడ్డి మనుషులు ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. పోలీసులూ... తప్పుడు కేసులు పెడతారే మా మీద... ఓ గర్భిణీని కొట్టారే... సిగ్గనిపించడంలేదా? మీకేమాత్రం బాధనిపించలేదా? 

దేవుడు స్క్రిప్టు తిరగరాశాడు... ఈ నెల 13వ తేదీన ఓటింగ్... జూన్ 4వ తారీఖున కౌంటింగ్... గెలిచేది మనమే! చిత్తుచిత్తుగా ఓడిపోయేది వైసీపీ! వైసీపీ ఇంటికి... మన కిరణ్ కుమార్ రెడ్డి పార్లమెంటుకు, జయచంద్రారెడ్డి పార్లమెంటుకు వెళతారు... అప్పుడు చూపిస్తా మన తడాఖా! 

సమైక్యాంధ్రప్రదేశ్ కు నేను 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశాను. కిరణ్ కుమార్ రెడ్డి మూడున్నరేళ్లు ముఖ్యమంత్రిగా చేశారు. హుందాతనంతో మెలగడం అంటే మమ్మల్ని చూసి నేర్చుకోవాలి పాపాల పెద్దిరెడ్డీ! నేను కన్నెర్ర చేసుంటే ఈ అంగళ్లుకు వచ్చేవాడివా, పుంగనూరులో ఉండేవాడివా నువ్వు? నువ్వేమైనా పెద్ద మొనగాడివా? మాకు రోషం లేదనుకుంటున్నావా...? నీ కొమ్ములు విరిచేస్తా, నీ కొవ్వు తగ్గిస్తాం... ఖబడ్దార్ జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. 

ఈ రాష్ట్రం మీ అబ్బ జాగీరా? నువ్వేమో పుంగనూరులో ఎమ్మెల్యే కావాలి, మంత్రివి కావాలి... నీ తమ్ముడు వలస పక్షి తంబళ్లపల్లెకు రావాలి... తంబళ్లపల్లె మీ తాత జాగీరా? నీ కొడుకు ఎంపీ కావాలి... ముగ్గురూ కలిసి దోచేయాలి... అడిగితే దాడులు చేస్తారా?" అంటూ చంద్రబాబు నిప్పులు చెరిగారు.

  • Loading...

More Telugu News