Indian students: స్కాట్లాండ్‌లో విషాద ఘ‌ట‌న‌.. జ‌ల‌పాతంలో మునిగి ఇద్ద‌రు ఏపీ విద్యార్థుల మృతి!

  • లిన్ ఆఫ్ తుమ్మెల్ జలపాతం వ‌ద్ద ఇద్ద‌రు భార‌త విద్యార్థుల మృత‌దేహాలు స్వాధీనం
  • డూండీ యూనివర్సిటీలో చ‌దువుతున్న ఇండియ‌న్ స్టూడెంట్స్
  • ట్రెక్కింగ్ చేస్తూ ప్ర‌మాద‌వ‌శాత్తు జ‌ల‌పాతంలో ప‌డిపోయిన వైనం
  • మృతుల‌ను ఆంధ్రప్రదేశ్ వాసులుగా గుర్తింపు
Two Indian students found dead at Scottish sightseeing spot

స్కాట్లాండ్‌లో విషాద ఘ‌ట‌న చోటుచేసుకుంది. అక్క‌డి ప్రముఖ సందర్శనా స్థలంలో ఇద్దరు భారతీయ విద్యార్థులు బుధవారం నీటిలో శవాలై కనిపించారు. గ్యారీ, తుమ్మెల్ నదులు కలిసే పెర్త్‌షైర్‌లోని పిట్లోచ్రీకి వాయవ్యంగా ఉన్న లిన్ ఆఫ్ తుమ్మెల్ జలపాతం వద్ద ఎమ‌ర్జెన్సీ స‌ర్వీసు సిబ్బంది ఇద్దరి మృతదేహాలను బుధవారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు.

డూండీ యూనివర్సిటీలోని విద్యార్థులు విహార యాత్ర‌కు వెళ్ల‌గా వారిలో న‌లుగురు స్నేహితులు ట్రెక్కింగ్ చేశారు. ఆ స‌మ‌యంలో ఈ ఇద్దరు నీటిలో పడి మునిగిపోయారు. మరో ఇద్దరు విద్యార్థులు ఎమ‌ర్జెన్సీ స‌ర్వీసులకు ఫోన్ చేసి చెప్ప‌డంతో ఈ విష‌యం బ‌య‌ట‌కు తెలిసింది. వారి స‌మాచారంతో పోలీసులు, అగ్నిమాపక, అంబులెన్స్‌లు ఘటనాస్థలికి చేరుకున్నాయి. అనంత‌రం ఇద్ద‌రు విద్యార్థుల మృత‌దేహాలను బ‌య‌ట‌కు తీశాయి. కాగా, మృతుల వయస్సు 22, 27 సంవ‌త్స‌రాలు ఉంటాయ‌ని పోలీసులు తెలిపారు. 

లండన్‌లోని భారత హైకమిషన్ ప్రతినిధి మాట్లాడుతూ.. "బుధవారం సాయంత్రం జరిగిన దురదృష్టకర సంఘటనలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు భారతీయ విద్యార్థులు నీట మునిగి చ‌నిపోవ‌డం జ‌రిగింది. వారి మృతదేహాలు కొద్ది దూరంలో లభ్యమయ్యాయి. భారత కాన్సులేట్ జనరల్ విద్యార్థుల కుటుంబాలతో సంప్రదింపులు జరుపుతున్నారు. డూండీ యూనివర్శిటీలో ఉంటున్న ఓ విద్యార్థి బంధువును కాన్సులర్ అధికారి క‌లిశారు. పోస్ట్‌మార్టం శుక్ర‌వారం (ఏప్రిల్ 19) జరుగుతుంది. ఆ తర్వాత మృతదేహాలను స్వదేశానికి పంపించేందుకు చర్యలు తీసుకుంటాం" అని తెలిపారు. 

స్కాట్లాండ్ పోలీసు అధికారి ఒక‌రు మాట్లాడుతూ.. "బుధవారం సాయంత్రం 7 గంటలకు బ్లెయిర్ అథోల్ సమీపంలోని లిన్ ఆఫ్ తుమ్మెల్ జలపాతం వద్ద నీటిలో ఇద్దరు వ్యక్తులు ప‌డిపోయిన‌ట్లు మాకు సమాచారం అందింది. దాంతో ఎమ‌ర్జెన్సీ స‌ర్వీస్ సిబ్బంది హూటాహూటిన‌ ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఆ త‌ర్వాత ఇద్దరు వ్యక్తుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘ‌ట‌న ప్ర‌మాద‌వ‌శాత్తు జ‌రిగిందా లేక ఏవ‌రైనా కావాల‌ని వారిని నీటిలో ప‌డేశారా అనే కోణంలో ద‌ర్యాప్తు జ‌రుగుతోంది. త్వ‌ర‌లోనే అన్ని వివ‌రాలు వెల్ల‌డ‌వుతాయి" అని చెప్పుకొచ్చారు.

More Telugu News